సూర్యకుమార్ హాఫ్ సెంచరీ
165 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ధాటిగా ఆడారు. ఈ క్రమంలో తొలి వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో రాహుల్.. మిచెల్ సాంట్నర్కు చిక్కాడు. ఆపై రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్ జతకలవడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
ఇద్దరూ పోటీపడి మరీ పరుగులు చేయడంతో భారత్ విజయం దిశగా సాగింది. అయితే హాఫ్ సెంచరీకి ముందు రోహిత్ ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ సాయంతో సూర్య హాఫ్ సెంచరీ బాది పెవిలియన్ చేరాడు. ఆపై శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠతకు దారి తీసింది. అయితే పంత్ బౌండరీ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు.
ఆదుకున్న గప్తిల్, చాప్మన్
అంతకుముందు న్యూజిల్యాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని కివీస్కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే న్యూజిల్యాండ్కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ డారిల్ మిచెల్ (0)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేసి భారత్కు శుభారంభం అందించాడు.
అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్మన్ (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70; 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. మరోవైపు చెత్త బంతులను బౌండరీలకు పంపారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. అంతేకాదు శతక (109) భాగస్వామ్యం నిర్మించారు.
ఇన్నింగ్స్ చివరలో తడబడి
ప్రమాదకరంగా మారుతున్న సమయంలో మార్క్ చాప్మన్ను స్పిన్నర్ ఆర్ అశ్విన్ అవుట్ చేశాడు. అదే ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ (0)ను కూడా యాష్ పెవిలియన్ చేర్చాడు. ఆపై భారీ సిక్సులతో చెలరేగుతున్న మార్టిన్ గప్తిల్ను దీపక్ చహర్ ఔట్ చేశాడు. అనంతరం టిమ్ సేఫెర్ట్ (12)ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డుకు బ్రేకులు పడ్డాయి. రచిన్ రవీంద్ర (7)ను మొహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు.
చివరకు మిచెల్ సాంట్నర్ (4), టీమ్ సౌథీ (0)లు క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ చివరలో తడబడిన కివీస్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి కివీస్ 164/6 స్కోరు చేసింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్ 2, భువనేశ్వర్ కుమార్ 2.. దీపక్ చహర్, మొహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.