19వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ
ఈ క్రమంలో 147 బంతులు ఆడిన పుజారా 7 ఫోర్ల సాయంతో తన టెస్ట్ కెరీర్లో 18వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత కొంత సమాయానికే కోహ్లీ 82 బంతుల్లో 5 ఫోర్లతో తన టెస్ట్ కెరీర్లో 19వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ కెప్టెన్గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని బద్దలు కొట్టాడు. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్సుల్లో 50కి పైగా పరుగులు సాధించిన కెప్టెన్గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరిస్లో విరాట్ కోహ్లీ ఆరు ఇన్నింగ్స్ల్లో నాలుగు సార్లు 50కిపైగా పరుగులు సాధించాడు.
గవాస్కర్ తర్వాత కోహ్లీనే
ఇంగ్లీషు గడ్డపై ఒకే ఒక్క బ్యాట్స్మెన్ ఆరు ఇన్నింగ్స్ల్లో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ ఒక్క బ్యాట్స్మెన్ మరెవరో కాదు టీమిండియా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్. 1979లో ఇంగ్లాండ్ పర్యటనలో సునీల్ గవాస్కర్ ఈ రికార్డు నమోదు చేశాడు. ఈ పర్యటనలో కోహ్లీకి ఇంకా రెండు టెస్టులు ఆడే అవకాశం ఉండటంతో గవాస్కర్ రికార్డుని కూడా కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా, ఒక టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేయడం కోహ్లీ ఇది తొమ్మిదోసారి కావడం విశేషం.
ఈ జాబితాలో అగ్రస్థానంలో రాహుల్ ద్రవిడ్
ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ (10 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్లు మాత్రమే ఒక టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో తొమ్మిదిసార్లు హాఫ్ సెంచరీలను నమోదు చేశారు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ కూడా చేరాడు. ఇదిలా ఉంటే, గత పర్యటనలో ఇంగ్లాండ్లో ఐదు టెస్టుల్లో 150 పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే 400 పైచిలుకు పరుగులు సాధించాడు. దీంతో తాను ఎక్కడైనా ఆడగలనని నిరూపించాడు.
భారీ స్కోరు దిశగా టీమిండియా
కాగా, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 70 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. దీంతో ఆధిక్యం 386 పరుగులకు చేరింది. విరాట్ కోహ్లీ (66), పుజారా (68) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లిష్ బౌలర్ల దాడిని సమర్థంగా అడ్డుకుంటున్నారు. వీరిద్దరి జోడీ మూడో వికెట్కు అజేయంగా 107 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.