ముంబై: ఇంకొద్దిరోజుల్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోంది. ఓ టెస్ట్ సహా మొత్తం ఏడు మ్యాచ్లల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్ మ్యాచ్. ఇదివరకు భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది.
దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్ 14న లార్డ్స్లో ఈ రెండు మ్యాచ్లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.
టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమ్ రెడీ అయింది. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్ కోసం జట్టును ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లు ముగిసిన తరువాత.. ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రెండు సిరీస్ల కోసం టీమ్ను ఎంపిక చేస్తుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఈ నెల 28వ తేదీ నాటికి ఇంగ్లాండ్తో ఆడబోయే వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్యలో- ముగ్గురు ఐపీఎల్ బౌలర్లు ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లబోతోన్నారు. ఈ ముగ్గురూ ఐపీఎల్లో వేర్వేరు ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. వారిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది బీసీసీఐ. నెట్ ప్రాక్టీస్ సమయంలో బ్యాటర్లకు బౌలింగ్ చేయడానికి ఈ ముగ్గురినీ ఎంపిక చేసింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ సూచనల మేరకు వారిని తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ సిమర్జిత్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ పేసర్ నవ్దీప్ సైనీ, ఢిల్లీ కేపిటల్స్ నుంచి కమలేష్ నగర్కోటిలను నెట్ బౌలర్లుగా ఇంగ్లాండ్కు పంపించనుంది.
ఇంగ్లాండ్తో అన్ని సిరీస్లు ముగిసేంత వరకూ ఈ ముగ్గురు జట్టుతో పాటు ఉంటారు. నెట్ బౌలర్లుగా సేవలు అందిస్తారు. ఆ తరువాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఆ పర్యటన కోసం ఈ ముగ్గురినీ కొనసాగిస్తుందా? లేక మరొకరికి అవకాశం ఇస్తుందా? అనేది ఆ తరువాత నిర్ణయిస్తుంది.