వాణిజ్య ప్రకటనల నిలిపివేత..
ఈ పరిస్థితుల మధ్య వివో యాజమాన్యం.. టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ నటించిన అడ్వర్టయిజ్మెంట్లపై కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతను నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది తాత్కాలికమేనని పేర్కొంది. టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్న వాణిజ్య ప్రకటనలు అవి. వాటికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇదవరకే పూర్తయింది కూడా.
విమర్శల నుంచి తప్పించినట్టుగా..
టెలికాస్ట్కు సిద్ధంగా ఉన్న సమయంలో వాటన్నింటినీ నిలిపివేస్తున్నట్లు వివో యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది తాత్కాలికమేనని, ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించుకున్న తరువాత వాటిని ప్రసారం చేస్తామని పేర్కొంది. తాము తీసుకున్న ఈ నిర్ణయం అటు విరాట్ కోహ్లీకి కూడా మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. అడ్వర్టయిజ్మెంటె టెలికాస్ట్ మొదలైన తరువాత సోషల్ మీడియాలో ఆయనపై వెల్లువెత్తే విమర్శల బారి నుంచి తప్పించినట్టువుతుందని పేర్కొంది.
వివోతో విరాట్..
గత ఏడాది ఏప్రిల్లో విరాట్ కోహ్లీ.. వివోతో అసోసియేట్ అయ్యారు. బ్రాండ్ అంబాసిడర్గా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివో మాత్రమే కాకుండా.. ఆడి లగ్జరీ కార్లు, అమెరికన్ టూరిస్టర్ లగేజీ, ప్యూమా స్పోర్ట్స్వేర్, టిస్సాట్ వాచీలు, మింత్రా ఫ్యాషన్, గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్, హైపరైస్ వెల్నెస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు అతను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన్నారు. గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్లో వాటాలు కూడా ఉన్నాయి.
వివో.. వివాదాస్పదం..
కాగా- ప్రస్తుతం వివో స్మార్ట్ఫోన్ల యాజమాన్యం కార్యకలాపాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిఘా పెట్టింది. దేశంలో ఆయా కంపెనీ వ్యవహారాలను తన రాడార్ పరిధిలోకి తీసుకొచ్చింది. వివోతో అసోసియేట్ అయివున్న 23 కంపెనీలు భారీ మొత్తంలో నిధులను చైనాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయా కంపెనీ మీద. మొత్తం వివో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 1,25,185 కోట్ల రూపాయలుగా తేలగా.. అందులో సగం మొత్తం అంటే.. 62,476 కోట్ల రూపాయలను చైనాకు పంపించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు.