

హైదరాబాద్: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) పండుగను ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా బెంగళూరులో తాము బసచేస్తున్న హోటల్లో ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం ఉదయం నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తమ దేశ సంస్కృతి ప్రతిబింబించేలా ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించిన అప్ఘనిస్థాన్ జట్టు మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలోనూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యథావిధిగా తమదేశ జెర్సీ ధరించి రెండోరోజు ఆటకు సిద్ధమయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆప్ఘన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో ఏకైక టెస్టులో టీమిండియా 474 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 347/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ప్రారంభంలోనే అశ్విన్ వికెట్ కోల్పోయింది.
ఫలితంగా 369 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా తన కెరీర్లో మూడో హఫ్ సెంచరీని నమోదు చేయగా, అతడికి జడేజా తోడు జడేజా రాణించడంతో వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో ఉమేష్ యాదవ్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.