జొహాన్నెస్బర్గ్: భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని కొనియాడాడు. క్రికెట్ పరంగా మహీకి అన్ని విషయాలు తెలుసని అభిప్రాయపడ్డాడు. ధోనీ సారథ్యంలో ఆడేందుకు తాను ఇష్టపడతానని తాహిర్ చెప్పాడు. తాహిర్ని ఈ ఏడాది కూడా రిటైన్ చేసుకున్నట్లు చెన్నై ఇటీవల ప్రకటించింది. 2018 నుంచి చెన్నై తరఫున తాహిర్ ఆడుతుంన్నాడు. అప్పట్లో అతడిని రూ.1 కోటికి దక్కించుకుంది.
తాజాగా ఇమ్రాన్ తాహిర్ స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీతో ఆడటం నా అదృష్టం. అతడితో కలిసి మూడేళ్లుగా ఆడుతున్నా. గొప్ప మనసున్న వ్యక్తి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాడు. అందర్నీ గౌరవిస్తాడు. అందుకే మహీ అంటే అందరికీ అమితమైన ఇష్టం. ఆటపై అతడికి పూర్తి అవగాహన ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్. అతడికి మనం చెప్పాల్సింది ఏమీ ఉండదు. బౌలర్లకు అనుకూలంగా ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలనే విషయం ధోనీకి తెలుసు' అని అన్నాడు.
ఎంఎస్ ధోనీతో కలిసి ఉంటే చాలా నేర్చుకోవచ్చని, ఒక క్రికెటర్గా తనకు అదే కావాలని ఇమ్రాన్ తాహిర్ పేర్కొన్నాడు. తాను మరింత కాలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాలనే కోరికతో ఉన్నానని చెప్పాడు. గత మూడేళ్లుగా చెన్నై తరఫున ఆడుతున్న ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఐపీఎల్లో మొత్తం 58 మ్యాచ్లు ఆడి 80 వికెట్లు పడగొట్టాడు. 2019 సీజన్లో చెన్నై తరఫున 17 మ్యాచ్లు ఆడి 26 వికెట్లు తీశాడు. అయితే యూఏఈలో జరిగిన 13వ సీజన్లో కేవలం 3 మ్యాచ్లే ఆడి ఒక వికెట్ తీశాడు.
ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఫిబ్రవరి 18న చెన్నైలో ఆటగాళ్ల వేలం జరగబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన బీసీసీఐ.. వేలం ముగిసిన తర్వాత టోర్నీ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపింది. భారత్ గడ్డపైనే ఐపీఎల్ 2021 సీజన్ని ఏప్రిల్- జూన్ నెలలో నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ 11న ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ని జూన్ 6న నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మహమ్మద్ హఫీజ్కు పీసీబీ షాక్.. లేటుగా వస్తానన్నందుకు వేటు! మండిపడుతున్న ఫాన్స్!