హైదరాబాద్: రాజకీయాల్లోకి అడుగుపెట్టినా క్రికెట్ అనే పదాన్ని ఇమ్రాన్ ఖాన్ నుంచి వేరు చేయలేం అనిపిస్తోంది. ఎందుకంటే దేశానికి వన్డే ప్రపంచ కప్ అందించి దేశ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తి ఇమ్రాన్. పాకిస్తాన్ నూతన ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఆహ్వానించిన విషయం విదితమే. ఆ వేడుకలో ఆహ్వానితుల జాబితాలో భారత క్రికెటర్లకు ఇమ్రాన్ స్థానం కల్పించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధానిగా ఈనెల 11వ తేదీన ఇమ్రాన్ ప్రమాణం చేయనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ క్రికెటర్ ఇమ్రాన్.. భారత్కు చెందిన క్రికెటర్లను కూడా ఆహ్వానించారు.
తాను క్రికెట్ ఆడే సమయంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఆగస్టు 11న ప్రధానిగా తన ప్రమాణ స్వీకార వేడుకకు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. వీరితో పాటు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్, ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్కు ఆహ్వానం అందించారు. పాక్ విదేశాంగశాఖ అధికారులతో చర్చించిన అనంతరం వీరికి ఆహ్వానం పంపినట్లు పీటీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఇమ్రాన్ పంపిన ఆహ్వానాన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను, ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నట్లు సిద్దూ తెలిపారు. ఇమ్రాన్ ఓ జీనియస్ అని, అతని క్యారక్టర్పై తనకు నమ్మకం ఉందని సిద్దూ అన్నారు. ఇమ్రాన్ ప్రమాణానికి వెళ్లనున్నట్లు ప్రకటించిన మొదటి క్రికెటర్ సిద్దూ కావడం విశేషం. సిద్దూతో పాటు కపిల్ దేవ్, గవాస్కర్, ఆమీర్ ఖాన్లకు కూడా ఇమ్రాన్ ఆహ్వానం పంపారు. ప్రజలను ఐక్యం చేసే సత్తా, స్నేహ వారధులను నిర్మించే సామర్థ్యం క్రీడాకారులకు ఉంటుందని ఈ సందర్భంగా సిద్దూ తెలిపారు. ఓ సాధారణ టీమ్తో 1992లో ఇమ్రాన్ పాకిస్థాన్కు ప్రపంచకప్ను అందించారని సిద్దూ గుర్తు చేశారు.
ఇస్లామాబాద్లోని రాష్ట్రపతి భవన్లో ఇమ్రాన్ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి మమ్మూన్ హుస్సేన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.