ఆటగాళ్ల ప్రత్యేకతకు చోటిస్తుంది
వుడ్హిల్ మాట్లాడుతూ... ' విరాట్ కోహ్లీ, సునీల్ గావస్కర్, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్ ఆటను చూశాం.వీరి బ్యాటింగ్ శైలి ఎంతో భిన్నంగా ఉంటుంది. భారత క్రికెట్ వ్యవస్థ పరుగులు చేయడం, ఫలితాలు సాధించడంపైనే ఆధారపడుతుంది. ఆటగాళ్ల ప్రత్యేకతకు చోటిస్తుంది. కానీ.. అదే ఆస్ట్రేలియాలో మాత్రం చేసే ప్రతి పరుగు ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేసాడు' అని చూస్తారన్నారు. ఉపఖండంలో బ్యాటింగ్ శైలి గురించి కాకుండా ఫలితాల గురించి ఆలోచించే వ్యవస్థ ఉందని వుడ్హిల్ వెల్లడించాడు.
పాత పద్ధతినే అనుసరిస్తోంది
'ఆస్ట్రేలియాలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సంప్రదాయానికి విరుద్ధంగా స్మిత్ చేసిన సెంచరీ కన్నా.. సంప్రదాయ పద్ధతిలో, మంచి టెక్నిక్తో షాన్ మార్ష్ చేసిన సొగసైన 30 పరుగులకే ఎక్కువ విలువిస్తారు. సంప్రదాయ పద్ధతులను అనుసరించే ఆస్ట్రేలియాలో స్మిత్ ప్రత్యేక శైలి ఆమోదయోగ్యం కాదు. ఇతర దేశాలు కుంబ్లే, రషీద్ వంటి భిన్నమైన స్పిన్నర్లకు చోటిస్తున్నప్పటికీ.. ఆసీస్ మాత్రం ఇంకా పాత పద్ధతినే అనుసరిస్తోంది' అని వుడ్హిల్ తెలిపాడు.
పరుగుల వరద
యాషెస్ సిరీస్లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో అర్ధ సెంచరీ చేసిన స్మిత్.. నాలుగో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఐదవ టెస్టులో కూడా అర్ధ సెంచరీ చేసాడు. మరోవైపు విండీస్ పర్యటనలో కోహ్లీ కూడా రాణించాడు. స్మిత్ యాషెస్ నాలుగు మ్యాచ్ల్లో 774 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో 937 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లీని అధిగమించాడు.