
హైదరాబాద్: మార్చి వచ్చిందంటే పిల్లల గుండెల్లో గుభేల్. ఎందుకంటే ఇది పరీక్షల సమయం. లక్షల మంది విద్యార్థులు రాత్రింబవళ్లు నిద్రలేమితో గడిపే రోజులివి. వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా పరీక్షలపై అంతే శ్రద్ధతో వ్యవహరిస్తుంటారు. ఇదే టెన్షన్లో ఉంది ఇప్పుడు దేశం మొత్తం. సాయంకాలాలు మైదానంలో సరదాగా ఆడుకొనే పిల్లలే కనిపించడం లేదు. ఎక్కడా వారి అల్లరిలేక ఇళ్లన్నీ బోసిపోతున్నాయి.
వారి కళ్లల్లో రేపటి ఎగ్జామ్ గురించి ఆత్రుత మాత్రమే కనిపిస్తుంది. టీమిండియా మాజీ సారథి గంగూలీ ఇల్లు కూడా ఇప్పుడు అంతే గంభీరంగా ఉంది. ఆయన 16 సంవత్సరాల కూతురు సన ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాస్తోంది. పుస్తకాలను ముందేసుకొని పరీక్షల గురించే ఆలోచిస్తున్న కూతురితో గంగూలీ మధ్యమధ్యలో కొంత విలువైన సమయాన్ని గడుపుతున్నాడు.
ఆ సమయంలో తండ్రికూతుళ్లిద్దరూ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు గంగూలీ. కూతురు కోల్కతాలో బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 26 నుంచి మొదలైన పరీక్షల నేపథ్యంలో ఉంచిన ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటోంది. మైదానంలో ఆటగాళ్లకు సలహాలు ఇచ్చిన ఈ మాజీ సారథి ఇప్పుడు కూతురు టెన్షన్ను దూరం చేస్తున్నాడు.
ఓ పక్క 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకం ప్రమోషన్లో ఉంటూనే కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు సౌరవ్ గంగూలీ. ఇప్పటి వరకు అమ్మకందార్లు క్రికెటర్ల అందరి పుస్తకాల కంటే గంగూలీ రాసిన పుస్తకం 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' ఎక్కువగా అమ్ముడుపోతోందని తెలిపారు.