
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా వెస్టిండిస్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో తొడకండరాలు పట్టేయడంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో విన్స్ ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం జేసన్ రాయ్ గాయానికి ఇంగ్లాండ్ మెడికల్ టీమ్ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. వెస్టిండిస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఛేదనలో బ్యాటింగ్ చేయడానికి రాయ్ వస్తాడో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ప్రస్తుతం 43 ఓవర్లకు గాను వెస్టిండిస్ 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. కార్లోస్ బ్రాత్ వైట్(14), ఓషీన్ థామస్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
దీంతో ఓపెనర్లుగా క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ ఇన్నింగ్స్ను ఆరంభించారు. వెస్టిండిస్ ఆరంభంలోనే ఎవిన్ లూయిస్(2) వికెట్ను కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి లూయిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్తో కలిసి క్రిస్ గేల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు.
అయితే జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉండగా క్రిస్ గేల్(36; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఫ్లంకెట్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని భారీ షాట్కు యత్నించి బెయిర్స్టో చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్లో మార్క్ వుడ్ వేసిన రెండో బంతికి తడబడుతున్న షాయ్ హోప్(11) ఎల్బీగా వెనుదిరిగాడు.
దీంతో 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత నికోలస్ పూరన్(63), హెట్ మెయిర్(39) నిలకడగా ఆడి స్కోరు బోర్డుని నడిపించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్(9), ఆండ్రీ రస్సెల్(21) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు.