లక్నో: కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్డౌన్తో ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి స్వగ్రామంలో చిక్కుకుపోయాడు. సాతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ రద్దవ్వడంతో అనిల్ చౌదర్ ఉత్తరప్రదేశ్లోని మారుమూల ప్రాంతమైన తన స్వగ్రామం దంగ్రోల్కు వెళ్లాడు. ఇది దేశ రాజధాని ఢిల్లీకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. ఎంతలా అంటే సెల్ఫోన్ సిగ్నల్ కోసం చెట్లాక్కాల్సిన దయనీయ పరిస్థితి ఆ గ్రామ ప్రజలది.
ఇక లాక్డౌన్తో అక్కడే ఉండిపోయిన అనిల్ చౌదరి కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. అతను సిగ్నల్ కోసం చెట్లెక్కుతున్నాడనే వార్త అప్పట్లో హల్చల్ చేసింది. ఈ సమస్యపై నెట్వర్క్ కంపెనీతో మాట్లాడిన అనిల్ చౌదరి.. ఆ గ్రామంలో తాజాగా ఓ సెల్ టవర్ని ఏర్పాటు చేయించాడు.
'సెల్ టవర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా సతీమణితో మాట్లాడాలన్నా.. ఐసీసీ వీడియో కాన్ఫరేన్స్లో పాల్గొనాలన్నా సిగ్నల్ కోసం చెట్లు ఎక్కే పరిస్థితి ఉండేది. సెల్ టవర్ ఏర్పాటు చేశాక ఆ సమస్యలు తీరాయి. ప్రస్తుతం ప్రజలు ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు వారి ఆన్లైన్ క్లాస్లను వింటున్నారు. నేను కూడా ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్, వర్క్షాప్లకి మా గ్రామం నుంచే అటెండ్ అవుతున్నా. మొత్తానికి గ్రామంలో సెల్ టవర్ను ఏర్పాటు చేయడంతో ఇక్కడ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు'అని అనిల్ చౌదరి తెలిపాడు.
ఇక భారత్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇప్పట్లో భారత్లో క్రికెట్ సిరీస్లు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దాంతో అనిల్ చౌదరి తన స్వగ్రామంలోనే మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది.
భారత్లో ఓ వంచకుడి వలలో చిక్కి.. నరకం అనుభవించా: ఆస్ట్రేలియా క్రీడాకారిణి