|
మైదానంలోకి అనుకోని అతిథి:
రెండో టెస్టులో గాలె మైదానంలోకి అనుకోని అతిథి వచ్చాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఉడుము తరహాలో ఉండే ఓ జంతువు బౌండరీ సరిహద్దు లోపలికి వచ్చింది. అక్కడే కాసేపు నిలబడి అటూఇటూ చూసింది. దీంతో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది. కెమరా మెన్స్ మైదానంలోని తెరలపై ఈ దృశ్యాన్ని చూపించారు. ఆపై మైదాన సిబ్బంది జంతువును బయటికి పంపించారు. అయితే అభిమానులు ఈ దృశ్యాన్ని ట్విటర్లో వైరల్ చేశారు. దీనిపై ఐసీసీ సరదాగా స్పందిస్తూ.. శ్రీలంకపై సిరీస్ అయినట్టు బిల్డప్ ఇచ్చింది.
పరిస్థితులను పర్యవేక్షిస్తాం:
శ్రీలంక జట్టు అదనపు ఫీల్డర్ను మోహరించిందని ఐసీసీ సెటైర్ వేసింది. 'గాలెలో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఈరోజు పోరులో శ్రీలంక అదనపు ఫీల్డర్ను మోహరించిందన్న వార్తలను ఐసీసీ సమీక్షిస్తోంది. పరిస్థితులను పర్యవేక్షిస్తాం. వెంటనే చర్యలు తీసుకుంటాం' అని ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఐసీసీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కూడా లంకపై సెటైర్లు పేల్చుతున్నారు. ఐసీసీ ఇలా సెటైర్లు వేయడం ఇదే మొదటిసారి కాదు. ఆటగాళ్లు, జట్లపై సమయం దొరికినప్పుడల్లా పంచ్లు వేస్తుంటుంది. అయితే అవి ఎప్పుడూ నవ్వుతెప్పిస్తూనే ఉంటాయి.
126 పరుగులకే లంక ఆలౌట్:
శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 381 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (110: 238 బంతుల్లో 11x4) సెంచరీ బాదగా.. డిక్వెల్లా (92), చండిమాల్ (52), పెరీరా (67) హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆరు వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 344 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (186: 309 బంతుల్లో 18x4) భారీ సెంచరీ బాదాడు. 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక 126 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 164 పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందుంచింది. జో రూట్కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి. తొలి టెస్టులో జో ద్విశతకం (228) చేశాడు.
27న భారత్కు:
రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్కు రానుంది. టెస్టు సిరీస్లో మొదటి రెండు టెస్టులకు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో జనవరి 27న చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బయో బబుల్లోకి ప్రవేశించనున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ఆరంభంకానుంది. ఈ పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?