యాషెస్తో ఊపు..
ఆ తర్వాత డిసెంబర్2లో జరిగే యాషెస్ సిరీస్ (5 టెస్ట్లు)తో చాంపియన్షిప్కు ఊపు రానుంది. అయితే డబ్ల్యూటీసీలో ఈ రెండు సిరీస్లు మాత్రమే ఐదు టెస్ట్లు ఉంటాయి. ఈ చాంపియన్షిప్లో భారత్.. న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్లకు ఆతిథ్యమివ్వనుండగా.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ఇంగ్లండ్తో వారి దేశాల్లో సిరీస్లు ఆడుతుంది. ఆగస్టులో మొదలయ్యే డబ్ల్యూటీసీ సెకండ్ ఎడిషన్ 2023 జూన్లో జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్ జరిగే వేదిక ఇంకా ప్రకటించలేదు. 2022 ఆసీస్ టూర్లో భారత్ నాలుగు టెస్ట్లు ఆడుతుంది. ఇది కాక.. భారత్ మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లు ఏడు, రెండు మ్యాచ్ల సిరీస్లు 13 ఆడుతుంది.
ఏ టీమ్ ఎన్ని మ్యాచ్లు..
డబ్ల్యూటీసీ-2లో ఇంగ్లండ్ అందరికంటే ఎక్కువగా 21 మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత భారత్ 19 టెస్ట్లు ఆడనుండగా.. ఆస్ట్రేలియా(18), సౌతాఫ్రికా (15), బంగ్లాదేశ్(12), న్యూజిలాండ్ (13) ఆడనున్నాయి. వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్ తలా 13 టెస్ట్లు ఆడుతాయి.
డబ్ల్యూటీసీ-1 మాదిరిగానే ఈసారీ 9 టెస్ట్ జట్లు ఆరు సిరీస్ల్లో తలపడతాయి. విదేశాల్లో 3, స్వదేశంలో 3 సిరీస్లు ఆడతాయి. ఎక్కువ టెస్ట్లున్న సిరీస్లు ఆడే జట్లు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే. మిగతా ఆరు జట్లు గరిష్టంగా 3 లేదా 2 టెస్ట్ల సిరీస్లే ఆడనున్నాయి. పరిస్థితులను బట్టి ఈ సిరీస్ల్లో మార్పులు జరగవచ్చు.
పాయింట్స్ విధానం మారింది..
డబ్ల్యూటీసీ-1లో ప్రతి సిరీస్కు 120 పాయింట్లు కేటాయించడంతో ఫ్యాన్స్.. టీమ్స్ చాలా గందరగోళానికి గురయ్యారు. దీంతో డబ్ల్యూటీసీ-2లో పాయింట్ల సిస్టమ్ను మార్చేశారు. గెలిచిన ప్రతీ మ్యాచ్కు 12 పాయింట్లు కేటాయిస్తారు. డ్రా చేసుకుంటే 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు ఇస్తారు.
సిరీస్లో ఎన్ని మ్యాచ్లనేది ఇక్కడ లెక్కలోకి రాదు. ఈ పాయింట్లను బట్టే టేబుల్ స్టాండింగ్స్ తీస్తారు. డబ్ల్యూటీసీ -1లో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ పద్దతిలోనూ చిన్న మార్పులు చేశారు. ఆడిన సిరీస్లను బేస్ చేసుకుని గతంలో(డబ్ల్యూటీసీ-1) పర్సంటేజ్ లెక్కిస్తే.. ఈసారి ఆడిన మ్యాచ్లను బేస్ చేసుకుని పాయింట్లను లెక్కించనున్నారు. ఉదాహరణకు కొత్త సైకిల్ ప్రకారం ఇంగ్లండ్ 21 మ్యాచ్లు ఆడనుంది. అన్ని మ్యాచ్ల్లో గెలిస్తే ఇంగ్లిష్ జట్టుకు 252 పాయింట్లు లభిస్తాయి. దీంతో ఆడిన మ్యాచ్లు, టీమ్ సాధించిన పాయింట్లను బట్టి పర్సెంటేజ్ తీసి ర్యాంకింగ్స్ కేటాయిస్తారు.