ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్లో ఫిక్సింగ్ అంశాలకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త ప్రణాళికను రూపొందించింది. మెగా టోర్నీలో పాల్గొంటున్న ప్రతీ జట్టుతో ఒక్కో అవినీతి నిరోధక అధికారి (ఏసీయూ) ఉండేలా ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్లో పాల్గొనే మొత్తం 10 జట్లకు పది మందిని ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఏసీయూ అధికారి వార్మప్ మ్యాచ్ల నుంచి ఫైనల్ వరకు అన్ని సమయాల్లో జట్టుతోనే ఉంటారని వెల్లడించింది. ఇంతకుముందు ఒక్కో వేదిక వద్ద ఒక్కో అవినీతి నిరోధక అధికారి ఉండేవారు. అయితే ప్రస్తుతం ఏసీయూ అధికారి జట్టు బస చేసే హోటల్లోనే ఉంటారు.
అంతేకాదు క్రికెటర్ల ప్రాక్టీస్, ప్రయాణ సమయంలో కూడా జట్టుతోనే కలిసి తిరుగుతారు. ప్రతి నిత్యం ఆ అధికారి జట్టుతోనే ఉండడంతో ఆటగాళ్లకు దగ్గర కావాలని ప్రయత్నించే వారిని సునాయాసంగా గుర్తించవచ్చు. దీంతో ఫిక్సింగ్ అంశాలకు తావుండదని ఐసీసీ పేర్కొంది. మరోవైపు ఆటగాళ్లు, ఏసీయూకు మధ్య స్నేహ సంబంధాలు కూడా పెరుగుతాయని ఐసీసీ తెలిపింది.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్ సాధించాలని ఇప్పటికే అన్ని జట్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. లండన్ వేదికగా మే 30న ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచకప్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇక జూన్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.