దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగైన స్థానంలో నిలిచాడు. ఇటీవల ముగిన ఆసియాకప్ 2022 టోర్నీలో మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెంచరీ బాదిన కోహ్లీ.. మరో రెండు హాఫ్ సెంచరీలతో 276 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో టీ20 ర్యాంకింగ్స్లో విరాట్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు అందుకున్నాడు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. అతను నెంబర్ 4 స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ రెండో స్థానంలో ఉండగా.. బాబర్ ఆజామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆరోన్ ఫించ్, డేవాన్ కాన్వే, పాతుమ్ నిస్సంక, ముహమ్మద్ వసీం, రీజా హెండ్రీక్స్ వరుసగా టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో వానిందు హసరంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఆసియాకప్ టైటిల్ శ్రీలంక గెలవడంలో హసరంగా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పాక్తో ఫైనల్లో మూడు కీలక వికెట్లు తీసిన హసరంగా.. బ్యాటింగ్లోనూ అదరగొట్టాడు. ఇక 11 వికెట్లతో ఆసియాకప్ టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచిన భువనేశ్వర్ కుమార్ ఏడో స్థానంలో నిలిచాడు. జోష్ హజెల్ వుడ్, టబ్రైజ్ షంసీ, ఆదిల్ రషీద్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్ టాప్ 5లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మహమ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచాడు.