|
ఐసీసీ గ్లోబల్ బాడీ మీటింగ్లో కీలక నిర్ణయాలు
అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో రెండు వరల్డ్ టీ20లు జరపాలన్న ఐసీసీ గత నిర్ణయానికి కూడా ఆమోదం లభించింది. ప్రస్తుతం కోల్కతాలో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఐసీసీ గ్లోబల్ బాడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైంది ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ షెడ్యూల్ నుంచి పూర్తిగా తొలగించడం.
|
ఐసీసీ గ్రీన్ సిగ్నల్
షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే, ఆ ట్రోఫీ స్థానంలో టీ20 వరల్డ్ కప్ను నిర్వహించడానికి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు ఐసీసీ గ్లోబల్ బాడీ ఏకగీవ్ర ఆమోదం తెలిపినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో టీ20 వరల్డ్ కప్
ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. 8 జట్లు ఆడే వన్డే టోర్నమెంట్ను రద్దు చేస్తున్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. ఐదు రోజుల పాటు సమావేశమైన ఐసీసీ బోర్డు సభ్యులు ఈ అంశాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఐసీసీ సభ్యత్వ దేశాల నుంచి ఆమోదం
'2021లో భారత్లో జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో వరల్డ్ టీ20ని నిర్వహించనున్నాం. గేమ్ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఐసీసీ సభ్యత్వ దేశాల నుంచి ఆమోదం లభించింది' అని వరల్డ్ క్రికెట్ బాడీ సమావేశం అనంతరం రిచర్డ్సన్ తెలిపారు.
వరల్డ్ టీ20లో 16 జట్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లకు మాత్రమే ఆడే అవకాశం ఉండగా, వరల్డ్ టీ20 ద్వారా 16 జట్లను ఆడించేందుకు ఐసీసీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనికి బీసీసీఐ నుంచి పాల్గొన్న అమితాబ్ చౌదరి అనుకూలంగా ఓటు వేయడంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు రిచర్డ్సన్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 2020లో ఆస్ట్రేలియాలో, ఆ తర్వాత ఏడాదే ఇండియాలో టీ20 వరల్డ్కప్ జరగనుంది. 2019, 2030లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంపై రిచర్డ్సన్
ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చే అంశంపై కూడా రిచర్డ్సన్ స్పందించాడు. దీనిపై రిచర్డ్సన్ మాట్లాడుతూ 'ఒలింపిక్స్లో క్రికెట్ను కూడా అంతర్భాగం చేయాలని ఎప్పట్నించో కోరుతున్నాం. ఒలింపిక్స్లో ఆటడమనేది మంచి అవకాశం. 2024లో ఒలింపిక్స్ ప్యారిస్లో జరగనున్నాయి. నిజానికే ఈ ఒలింపిక్స్కే చేర్చాల్సింది. కానీ ఈమేరకు ఐఓసీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాం. అందుకే 2028లో లాస్ఏంజిల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో అయినా క్రికెట్ను చేర్చాలని యోచిస్తున్నాం. ఈమేరకు లాస్ ఏంజిల్స్ క్రీడాశాఖతో మంతనాలు జరిపాం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒలింపిక్స్లో చేరిపోయినట్లే' అని అన్నారు.