IPL 2021: ఆలా అయితే టోర్నీ కుదరంటున్న ఐసీసీ.. బీసీసీఐకి కొత్త చిక్కులు!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్లను యూఏఈలో నింపాదిగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఇప్పుడు చిక్కొచ్చి పడింది. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ 27 రోజుల విండోని మెగా లీగ్ కోసం బీసీసీఐ కేటాయించింది. డబుల్ హెడర్లను తగ్గించడం కోసం టోర్నీ జరిగే రోజులను పెంచాలని బోర్డు భావించింది. నిజానికి అక్టోబరు 10న ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ 15న దసరా, వీకెండ్ స్టార్ట్ కాబోతుండటంతో వ్యూవర్షిప్ పెంచుకోవాలని ఫైనల్ తేదీని బీసీసీఐ మార్చింది. ఇప్పుడు ఇదే అసలు సమస్య అయింది.

అక్టోబరు 10 దాటకూడదు:
అక్టోబరు 18 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఐసీసీ టోర్నీలకి కనీసం 7-10 రోజుల ముందు ఎలాంటి టోర్నీ ఉండకూడదు. మరి అక్టోబరు 15న ఐపీఎల్ 2021ఫైనల్ని బీసీసీఐ నిర్వహిస్తే.. కేవలం మూడు రోజుల గ్యాప్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం అవ్వనుంది. ఇది ఐసీసీ రూల్స్కు విరుద్ధం. ఐసీసీతో పాటు మిగిలిన క్రికెట్ దేశాల బోర్డులు కూడా బీసీసీఐ షెడ్యూల్ని ఒప్పుకోవు. ఐపీఎల్ కోసం తమ ఆటగాళ్లని పంపే బోర్డులు ఫైనల్ తేదీని వ్యతిరేకించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అక్టోబరు 10 దాటి ఐపీఎల్ టోర్నీని నిర్వహణకు అనుమతించేందుకు ఐసీసీ సుముఖంగా లేదట.

అప్పటి వరకు అంటే కష్టమే:
అక్టోబరు 10న టోర్నీ ముగియాలి. ఈ తేదీ దాటి టోర్నీ నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి. 'టీ20 ప్రపంచకప్ అక్టోబరు 18న ఆరంభమవుతుంది. అప్పుడు అక్టోబరు 15 వరకు ఐపీఎల్ 2021ని కొనసాగించడం ఎలా సాధ్యమవుతుంది. ఇందుకు ఐసీసీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అసలు టీ20 ప్రపంచకప్లో పోటీపడుతున్న దేశాలు తమ ఆటగాళ్లు అక్టోబరు 15 వరకు ఐపీఎల్ ఆడేందుకు ఒప్పుకుంటాయా?. అక్టోబరు 10 దాటి బీసీసీఐ ఐపీఎల్ను నిర్వహించదు' అని ఐసీసీ వర్గాలు చెప్పాయి. దీంతో ఐపీఎల్ ఫైనల్ అక్టోబరు 10న జరిగే అవకాశం ఉంది.

నవంబరు 14న ఫైనల్:
అక్టోబరు మధ్యలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ నవంబరు 14న ఫైనల్తో ముగుస్తుందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కానీ భారత్లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. రోజురోజుకు కేసులు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ నెల ఆఖరి వరకూ ఆతిథ్యంపై నిర్ణయం కోసం ఐసీసీని బీసీసీఐ గడువు కోరింది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. యూఏఈలోనే మెగా టోర్నీని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ నిర్వహణకి ఉన్న అనువైన మార్గాల్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

డబుల్ హెడర్స్ పెంచితే చాలు:
ఇప్పటికే 29 మ్యాచ్లు పూర్తయిన ఐపీఎల్ 2021లో మరో 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది. దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బీసీసీఐ ముందునుంచి చెబుతూ వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్లో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. ఐసీసీ చెపుతున్న ప్రకారం 22 రోజుల సమయం ఉంది. దీంతో డబుల్ హెడర్స్ పెంచితే సరిపోతుంది. అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. టీ20 ప్రపంచకప్ యూఏఈలోనే జరిగితే.. అందరూ పాల్గొనే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications