న్యూ ఢిల్లీ: వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరిగే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఐసీసీ ఓ తియ్యటి కబురు చెప్పింది. అదేంటంటే ప్రపంచకప్ విజేత అందుకునే ట్రోఫీని నిర్వాహకులు పలు దేశాల్లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆగష్టు నెల 27న దుబాయ్లో ఈ పర్యటన ప్రారంభంకానుంది.
ఈ పర్యటనలో భాగంగా ట్రోఫీ సుమారు తొమ్మిది నెలల్లో మొత్తం ఇలా ఐదు ఖండాల్లో తిరిగి 21 దేశాల్లో 60 పట్టణాలను చుట్టి రానుంది. ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే దేశాలతో పాటు మరో పదకొండు దేశాల్లో ఈ ట్రోఫీని ప్రదర్శించనున్నారు. వీటిలో నేపాల్, అమెరికా, జర్మనీ కుడా ఉన్నాయి. దుబాయ్ తర్వాత ట్రోఫీని మొదట ఆసియా దేశాల్లో ఉంచనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ఈ ట్రోఫీ తిరిగి ఇంగ్లాండ్ చేరుకోనుంది.
ఇంగ్లాండ్లో వంద రోజుల పాటు ఈ ట్రోఫీని పలు ప్రదేశాల్లో ప్రదర్శిస్తారు. అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు నిర్వాహకులు ట్రోఫీని పలు దేశాల్లో స్వయంగా అభిమానుల ఇంటికి కూడా తీసుకెళ్తారట. పర్యటన పూర్తి చేసుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ 2019 జులై14న లార్డ్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజేత చేతికి దక్కుతుంది. గమనించదగ్గ విషయమేమంటే వరల్డ్ కప్ టోర్నమెంట్లో పాల్గొనే దేశాలు 11మాత్రమే అయినప్పటికీ అన్ని దేశాల్లో వరల్డ్ కప్ ప్రదర్శన నిర్వహించడమే.
వాటిల్లో నేపాల్, అమెరికా.. జర్మనీలు కీలకమైనవి. ప్రతి ఒక్క అభిమాని ఈ కార్యక్రమంలో భాగంగా కావాలని ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ కోరారు. ఇక ట్రోఫీ యాత్ర ఇలా జరగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొదలుపెట్టిన ట్రోఫీ ఒమన్, అమెరికా, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెన్యా, ర్వాండా, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీలతో ముగించుకుని ఇంగ్లాండ్లోని వేల్స్కు 19 ఫిబ్రవరి 2019న చేరుకుంటుంది.