వివాదానికి కారణం కోహ్లినే:
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కోహ్లీతో రబాడ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని తాజాగా వివరిస్తూ... 'ఐపీఎల్లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. ఓ మ్యాచ్ సందర్భంగా విరాట్ నా బౌలింగ్లో ఫోర్ కొట్టాడు. అనంతరం నన్నేదో అన్నాడు. ఐతే నేను తిరిగి అతడిని అదే మాట అంటే కోపం తెచ్చుకున్నాడు' అని రబాడ తెలిపాడు.
భరించే శక్తి కోహ్లీకి లేదు:
'విరాట్ తనలో తాను ఉత్సాహం నింపుకోవడానికి ప్రత్యర్థుల్ని ఏదో ఒకటి అంటాడేమో. కానీ తిరిగి ఎవరైనా అంటే తట్టుకోలేడు. విరాట్ గొప్ప బ్యాట్స్మన్ అయినా.. తిట్లను భరించే శక్తి అతడికి లేదు. కోహ్లీ ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఇలాంటివి ఘటనలు నా ఏకాగ్రతను దెబ్బ తీయలేవు' అని రబాడ పేర్కొన్నాడు.
గొడవలు పడటం కొత్తేం కాదు:
ఆటగాళ్లతో గొడవలు పడటం రబాడకు ఇది తొలిసారి కాదు. 2017లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గతేడాది ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై కూడా మాటల యుద్ధం చేసాడు. స్మిత్తో శృతిమించి ప్రవర్తించడంతో మరోసారి సస్సెన్షన్కు గురయ్యాడు. టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది.