ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ధోనీకి ఈ ప్రపంచకప్ ఏ మాత్రం కలిసి రావట్లేదు. స్లో బ్యాటింగ్తో విమర్శకులు ఎదుర్కొన్న ధోనీ.. కీపింగ్లో కూడా విఫలమయ్యాడు. ప్రపంచ అగ్రశ్రేణి వికెట్ కీపర్గా ఉన్న మహీ ఈ ప్రపంచకప్లో ఏకంగా బైస్ రూపంలో 24 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్లో అత్యధిక బైస్ ఇచ్చిన వికెట్ కీపర్గా మహీ నిలిచాడు. టోర్నీ మొత్తం బైస్ రూపంలో 71 పరుగులే వచ్చాయి. ఇందులో ధోనీ ఒక్కడే 24 పరుగులు ఇవ్వడం గమనార్హం. ధోనీ తర్వాత ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 9 పరుగులు సమర్పించుకున్నాడు. షై హోప్, జొస్ బట్లర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తం టోర్నీలో క్యారీ 17 ఔట్లతో వికెట్ కీపర్ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. 9 ఔట్లతో ధోనీ 9 స్థానంలో కొనసాగుతున్నాడు.
శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనే ధోనీ.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 4 బైస్ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో 4 ఔట్లలో ధోనీ భాగమయ్యాడు. దీంతో ఈ ఘనత అందుకున్న మూడో భారత వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు. ధోనీ కన్నా ముందు 5 ఔట్లతో నయాన్ మోంగియా, సయ్యద్ కిర్మాణి ఉన్నారు. మంగళవారం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరగనుంది. మరి ఈ మ్యాచ్లో అయినా ధోనీ మెప్పిస్తాడో చూడాలి.
ధోనీ ఆదివారం 38వ పడిలోకి ప్రవేశించాడు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్లో శుభాకాంక్షల వర్షం కురిసింది. ప్రపంచకప్ వేటలో ఉన్న విరాట్ సేనతో పాటు, మాజీలు, దిగ్గజ క్రికెటర్లు ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాలు శనివారం రాత్రి ధోనీతో కేక్ కటింగ్ చేపించారు. అనంతరం కేక్ క్రీమ్ పూసుకున్న ముఖంతో ధోనీ జీవాతో కలిసి చిందులు వేశాడు. సాక్షి, జీవాలతో పాటు పలువురు క్రికెటర్లు ధోనీ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. ఈ వీడియోను అభిమానులు షేర్లు చేస్తూ.. లైక్లు కొట్టారు. 'హ్యాపీ బర్త్డే ధోనీ' అంటూ శుభాకాంక్షలు తెలిపారు.