ప్రపంచకప్-2019లో పాల్గొనే అన్ని జట్లు టీమిండియా బౌలింగ్ గురించి భయపడుతున్నాయి అని పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నారు. మరో కొద్ది రోజుల్లో ప్రపంచకప్ సమరం ప్రారంభం కాబోతోంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. భారత్ గత కొద్ది కాలంగా బౌలింగ్లో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా రాణిస్తున్నారు. అయితే ప్రపంచకప్కు ఎంపికయిన భారత బౌలర్లు ఐపీఎల్లో రాణించలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఐపీఎల్లో ఆసాంతం టీమిండియా స్టార్ పేసర్ జఫ్రీత్ బుమ్రా తప్ప ఎవరూ రాణించలేదు. భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ అందరూ విఫలమయ్యారు. దీంతో భారత బౌలర్లలపై విమర్శల దాడి మొదలైంది. మాజీలు అయితే ఇక్కడ ప్లాప్ అయినా.. ఇంగ్లాండ్ పిచ్లపై రాణిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయమై పేసర్ భువనేశ్వర్ కూడా స్పందించాడు.
'ప్రపంచకప్కు ఐపీఎల్ ఓ మంచి ప్రాక్టీస్. బాగా రాణించిన ఆటగాడు కచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్లో అడుగుపెడతాడు. నాకు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లాండ్లో కొన్నాళ్లుగా పిచ్లు ఫ్లాట్గా ఉన్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే జట్లన్నీ టీమిండియా బౌలింగ్ గురించి భయపడుతున్నాయి. గత కొంత కాలంగా బౌలర్ల ప్రదర్శనే ఇందుకు కారణం. రోజు రోజుకూ జట్టు బౌలింగ్ మెరుగవుతుంది. ఎలాంటి పిచ్ మీదయినా రాణించగలం' అని భువి అన్నారు.
'గాయాలు సహజమే కానీ త్వరగా కోలుకోవాలి. స్వింగ్ ఉన్న కారణంగా ఇంగ్లాండ్లో బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాను. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ల బౌలింగ్ అన్ని జట్లకూ ఇప్పటికే ఓ అవగాహన ఏర్పడి ఉంటుంది. నేను కూడా నా సామర్థ్యం మేరకు రాణిస్తాను' అని భువనేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు.