టీమిండియా మాజీ సారథి కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అండగా నిలిచాడు. ప్రస్తుతం ధోనీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అటు బ్యాటింగ్ ఇటు కీపింగ్లోనూ ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ధాటిగా ఆడలేకపోవడం, సింగిల్స్ తీయడంతో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంతకుముందే ఇంగ్లండ్, ఆఫ్గనిస్థాన్ మ్యాచ్ల్లోనూ ధోనీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా మాజీ క్రికెటర్లు అతనిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతున్నపుడు కామెంటేటర్లుగా ఉన్న సౌరవ్ గంగూలీ, నాసర్ హుస్సేన్ మాత్రం ధోనీ బ్యాటింగ్ స్టైల్పై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక అభిమానులు అయితే తీవ్రగా మండిపడ్డారు.
బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ ధోనీ జిడ్డు బ్యాటింగ్ చేసాడు. ఇన్నింగ్స్ చివరలో 33 బంతులు ఎదుర్కొన్న ధోనీ.. కేవలం 35 పరుగులు చేశాడు. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ 350కి పైగా స్కోర్ సాధించే అవకాశం ఉన్నా.. ధోనీ నెమ్మదిగా ఆడటం వల్లే ఎక్కువ స్కోరు చేయలేదని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ ధోనీకి మద్దతుగా నిలిచాడు.
తాజాగా సచిన్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్లో ధోనీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు అవసరమైన పరుగులు చేసాడు. 33 పరుగులు చిన్నవేమీ కాదు. ఒకవేళ అతను 50 పరుగులు చేసే వరకు క్రీజులో ఉంటే.. సహచరులకు అండగా ఉండేవాడు. అతడు మైదానంలో ఉన్నంతవరకు జట్టు కోసమే ఆడాడు. అతను జట్టుకే మొదటి ప్రాధాన్యమిస్తాడు. ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. జట్టుకు అవసరమైనదే ధోనీ చేశాడు' అని సచిన్ అన్నారు.
ఈ మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.