దుబాయ్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్లో ఇంగ్లండ్ వేదికగా జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్యూటీసీ) ఫైనల్ యథావిధిగా జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసింది. డబ్యూటీసీ ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. అయితే భారత్లో ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడకు రాకపోకలపై ఇంగ్లీష్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. భారత్ను రెడ్లిస్ట్ జాబితాలో చేర్చింది.
భారత్ నుంచి స్వదేశం తిరిగి వచ్చే బ్రిటన్ వాసులు పది రోజుల కఠిన క్వారంటైన్లో ఉండాల్సిన విధంగా ఇంగ్లండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ కొత్త ఆంక్షలు విధించినా.. అనుకున్న ప్రకారమే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నిర్వహిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. క'రోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఇంగ్లండ్లో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను ఎలా నిర్వహించాలనేదానిపై ఈసీబీ, ఇతర అధికారులు మాకు వివరించారు. దాంతో యథావిధిగా మ్యాచ్ను నిర్వహిస్తామనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల పరిస్థితులపై ఇంగ్లండ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి కూడా స్పందించారు. 'ప్రయాణ ఆంక్షలనేవి కరోనా వ్యాప్తిని బట్టి ఉంటాయి. జూన్లో కోహ్లీసేన ఇంగ్లండ్కు బయలుదేరే నాటికి భారత్ రెడ్లిస్ట్లో ఉండకపోవచ్చు' అని బీసీసీఐ అధికారి అభిప్రాయపడ్డారు. అయితే రెడ్లిస్ట్లో ఉన్న దేశాల ఆటగాళ్లు ఇంగ్లండ్కు ఆడడానికి వస్తే తగిన ఏర్పాట్లు చేసి బయోసెక్యూర్ విధానంలో మ్యాచ్లు నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఈసీబీ అధికారి మీడియాకు తెలిపారు. కరోనా కారణంగా టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను బయో సెక్యూర్ బబుల్లో నిర్వహించనున్నారు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. డబ్ల్యూటీసీ పట్టికలో పీసీటీ పాయింట్ల పరంగా చూస్తే టీమిండియా 72 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఆసీస్ 69.2 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పరంగా చూస్తే.. కివీస్కు, ఆసీస్కు 0.8 శాతం తేడా మాత్రమే ఉంది.
సౌతాంప్టన్లో ఇప్పటి వరకూ ఆరు టెస్టులు మాత్రమే జరిగాయి. ఇందులో మూడింట్లో ఫలితం తేలింది. ఒక టెస్టులో వెస్టిండీస్ గెలవగా.. మిగతా రెండింట్లో ఇంగ్లండ్ విజయాలు అందుకుంది. అయితే ఆ రెండు విజయాలు భారత్పైనే కావడం గమనార్హం. ఇదే వేదికపై 2014లో 266 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. 2018లో 60 పరుగుల తేడాతో మరోసారి ఓడించింది. అయితే సౌతాంప్టన్లో న్యూజిలాండ్ ఇంత వరకూ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది మనకు కలిసొచ్చే అంశం.
CSK vs RR: ఎలా ఆడాలో తెలుసు.. నాపై ఆంక్షలు విధించొద్దు! ఐపీఎల్ అంటేనే రిస్కీ గేమ్: శాంసన్