హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వీలు చిక్కినప్పుడల్లా తనదైన పంచ్లతో ట్విటర్లో హల్చల్ చేస్తుంటాడు. తన ఫన్నీ ట్వీట్లతో ఫ్యాన్స్కు వినోదాన్ని పంచుతూనే ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , స్కోరు కార్డు
తాజాగా మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, షేన్ వార్న్లపై సెహ్వాగ్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్లో వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ లెజెండ్లు సౌరభ్ గంగూలీ, షేన్వార్న్ తదితరులతో కలిసి సెహ్వాగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

కామెంటరీ సందర్భంగా అద్భుతమైన పంచ్లు విసురుతున్న సెహ్వాగ్ తాజాగా తన తోటి కామెంటేటర్స్ గంగూలీ, వార్న్లను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కామెంటరీ చేస్తూనే మధ్యలో బ్రేక్ దొరికినప్పుడు గంగూలీ, వార్న్ కునుకు తీశారు. అలా వాళ్లు పడుకున్న సమయంలో ఫొటోలు తీసి వాటిని ట్విట్టర్లో పోస్టు చేశాడు.
అంతేకాదు 'తాము కనే కలల్ని బట్టే వారి భవిష్యత్తు రూపు దిద్దుకుంటుంది. ఈ దిగ్గజాలు కూడా తమ కలల్ని సాకారం చేసుకోవడం కోసం సమయాన్ని వృథా చేయడం లేదు.. నిద్రపోతూ దాన్ని ఆస్వాదిస్తున్నారు.' అంటూ కామెంట్ కూడా పెట్టాడు. సెహ్వాగ్ ట్వీట్ను షేన్ వార్న్ వర్షం పడే సమయంలో తాను పడుకున్నపుడు ఫొటో తీసేసావా అని చమత్కరించాడు.