బోర్డు సభ్యులు నిరసన:
షెడ్యూల్లో భాగంగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాలి. కరోనా కారణంగా పొట్టి కప్ వాయిదా పడుతుందని, ఆ విండోలో ఐపీఎల్ 2020 జరుగుతుందని, దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సుముఖంగానే ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలపైనే గురువారం శశాంక్ మనోహర్ నేతృత్వంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో చాలా మంది సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అత్యున్నత బోర్డు సమావేశంలో జరిగే చర్చల విశ్వసనీయత, పవిత్రతపై అందరికీ నమ్మకం కుదిరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా తుది నిర్ణయం ప్రకటించకుండానే ఇలా విషయాలు బయటికి పొక్కడం సరికాదని అభిప్రాయపడ్డారు.
జూన్ 10 తర్వాతే:
అంతర్జాతీయ క్రికెట్ మండలి పవిత్రత, గోప్యతపై ఐసీసీ ఎథిక్స్ అధికారి ఆధ్వర్యంలో విచారణ జరపాలని బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కమిటీ ఇచ్చే నివేదికను వచ్చే నెల 10న జరిగే తదుపరి సమావేశంలో ఐసీసీ సీఈఓ బోర్డు ముందుంచుతారు. కరోనా మహమ్మారితో వేగంగా మారుతున్న ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్ ప్రణాళికలపై సభ్య దేశాలతో చర్చలు కొనసాగించాలని ఐసీసీకి బోర్డు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా తమకు 2020 టీ20 ప్రపంచకప్కు బదులుగా.. 2021 టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యమిచ్చే అవకాశమివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా.. ఐసీసీని కోరినట్లు వార్తలొచ్చాయి.
పొట్టి ప్రపంచకప్పై స్పష్టత లేదు:
అసలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పొట్టి ప్రపంచకప్ జరుగుతుందా లేక వచ్చే ఏడాదికి వాయిదానా లేక 2022లో జరుగుతుందా అన్నదానిపై ఐసీసీ బోర్డు సమావేశంలో స్పష్టత ఇవ్వలేకపోయింది. దీనికి తోడు కరోనా వైరస్ ప్రభావం తర్వాత క్రికెట్ పునరుద్ధరణ, క్రికెట్ కమిటీ సూచించిన ఉమ్మిపై నిషేధం, భవిష్యత్ పర్యటనల ప్రణాళిక (ఎఫ్టీపీ), చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వంటి అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్ 10 తర్వాతే అన్ని నిర్ణయాలు వెలుబడే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచకప్నకు వచ్చిన సమస్య ఏంటి?:
పొట్టి ప్రపంచక్పను ఎప్పుడు జరపాలనే దిశగా ఐసీసీ మూడు అత్యవసర విండోలపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి, అక్టోబరుతో పాటు 2022 అక్టోబరు కూడా ఇందులో ఉంది. ఇదిలా ఉంటే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ప్రకటించిన భారత పర్యటన షెడ్యూల్ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నది. భారత్తో అక్టోబర్లో టీ20 సిరీస్ నిర్వహించేందుకు సిద్ధమైనప్పుడు అదే సమయంలో ప్రపంచకప్నకు వచ్చిన సమస్య ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.