దూబే చెత్త రికార్డు:
ఒక ఓవర్లో ఏకంగా 34 పరుగులు ఇవ్వడంతో దూబే ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఏ ఫార్మాట్లో అయినా ఓ ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్గా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్లో కివీస్ ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ విజృంభించి ఆడి 34 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో ఓ సరదా ప్రశ్న వేసింది.
అర్రే నాకు తెలీదే:
'6, 6 , 4 ,1 , 4నోబ్, 6, 6 = 34 పరుగులు. శివమ్ దూబే టీ20 చరిత్రలో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. టీ20ల్లో అత్యధిక పరుగుకు ఇచ్చిన తొలి బౌలర్ ఎవరో గుర్తుందా?' అని ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో అభిమానులను ప్రశ్నించింది. ఐసీసీ అడిగిన ప్రశ్నకు ఇంగ్లీష్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతే సరదాగా సమాధానం ఇచ్చాడు. 'ఎక్కువ పరుగులిచ్చిన తొలి బౌలర్ ఎవరో నాకు తెలీదు' అని రాసుకొచ్చాడు.
బ్రాడ్ను మరే బౌలర్ దాటాడేమో?:
2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్కు టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్లో మొత్తం ఆరు సిక్సులు బాదడంతో..ఏకంగా 36 పరుగులు వచ్చాయి. అలా టీ20 క్రికెట్లో స్టువర్ట్ బ్రాడ్ ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్గా తొలి స్థానంలో నిలిచాడు. నాటి మ్యాచ్లో యువరాజ్ కొట్టిన సిక్సులు భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. బహుశా బ్రాడ్ను మరే బౌలర్ దాటే అవకాశం ఉండదేమో!! ఒకవేళ నోబాల్స్ వేస్తే తప్ప.
తొలి భారత బౌలర్గా దూబే:
టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్గా దూబే చెత్త రికార్డును ఖాతలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2016లో అమెరికా లాడర్హిల్స్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బిన్నీ 32 పరుగులిచ్చాడు. తర్వాతి స్థానంలో భారత ఆల్రౌండర్ సురేశ్ రైనా ఉన్నాడు. 2012లో జోహెన్నెస్బర్గ్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రైనా 26 పరుగులు సమర్పించుకున్నాడు.