సిడ్నీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తొండాటకు తెరలేపకుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని ఆ దేశ మాజీ క్రికెటర్ ఇయాన్ హీలీ అన్నాడు. భారత్ వేదికగా జరగనున్న ఈ నాలుగు మ్యాచ్ల సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తుండగా.. మరోవైపు టీమిండియా సైతం సన్నదమవుతోంది.
అయితే ఈ సారి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా ఇరు జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా జట్టే వామప్ మ్యాచ్ ఆడవద్దని నిర్ణయించుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్కు బీసీసీఐ సరైన పిచ్ ఇవ్వకుండా తమను మోసం చేస్తుందనే ఆస్ట్రేలియా టీమ్మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ జట్టు సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఇయాన్ హీలీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇరు జట్లకు సమానంగా సహకరించే పిచ్ తయారు చేస్తే.. భారత్ను ఆస్ట్రేలియా సునాయసంగా ఓడిస్తుందని అభిప్రాయపడ్డాడు.'ఈ సిరీస్లో పిచ్లు ఇరు జట్లకూ సహకారం లభించేలా తయారు చేస్తే.. అంటే బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటం, నిలకడగా స్పిన్ బౌలింగ్ను సంధించేలా తయారు చేస్తే ఆసీస్ తప్పకుండా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. కానీ, నాకున్న ఒకే ఒక్క ఆందోళన మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ బౌలింగ్పైనే ఉంది. గత సిరీస్లో సరైన పిచ్లను రూపొందించలేదు. దీంతో తొలి రోజు నుంచే బంతి బౌన్స్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మాకంటే భారత్ చాలా చక్కగా ఆడగలుగుతుంది.
భారత్లో పది వికెట్లు తీయడానికి 10 అవకాశాలు మాత్రమే ఉంటాయి. అదే ఆసీస్లో అయితే బౌన్స్, బంతి ముందుకు కదలడం, వేగం.. ఇలా 13 అవకాశాలు దొరుకుతాయి. వాటిల్లో కొన్ని వృథా అయినా నష్టం లేదు. కానీ భారత్లో మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. భారత్ జట్టులో ఎంత ఒత్తిడి ఉన్నా సరే తట్టుకోగలరు. ఇదే సూత్రాన్ని ఆసీస్ ఆటగాళ్లూ వర్తింపజేసుకోవాలి'అని ఇయాన్ హీలీ సూచించాడు.
ఇక 2004 నుంచి భారత్లో ఆసీస్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలుచుకోలేదు. అంతేకాకుండా గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోను భారత్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఆసీస్ను రెండు టెస్ట్ సిరీస్ల్లో ఓడించింది. ఈ సిరీస్ గెలవడం భారత్కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే భారత్ 2-0 లేదా 3-1తో ఈ సిరీస్ గెలవాల్సి ఉంది. సిరీస్ కైవసం చేసుకుంటే భారత్ టెస్ట్ల్లో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకోనుంది.