దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని మరో ఆటగాడు భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. కోల్కతా మిస్టీరియస్ స్పిన్నర్గా రాణిస్తున్న 29 ఏళ్ల వరుణ్.. ఢిల్లీ క్యాపిటల్స్తో ఇటీవల జరిగిన పోరులో ఏకంగా ఐదు వికెట్లతో మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఈ ప్రదర్శన బీసీసీఐ సెలెక్టర్లను ఆకర్షించిందేమో కానీ.. ఆసీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో అతడు చాన్స్ కొట్టేశాడు. టీ20 జట్టుకు ఎంపిక కావడాన్ని నమ్మలేకపోతున్నానని వరుణ్ అన్నాడు.
'భారత జట్టుకు ఎంపికయ్యానని సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసింది. ఆ వార్తను నేను నమ్మలేకపోయా. కోల్కతా నైట్రైడర్స్ తరపున నిలకడగా రాణించి జట్టుకు విజయాలు అందించాలనేది నా ప్రాథమిక లక్ష్యం. ఇప్పుడు భారత జట్టులోనూ ఆడి.. అలాగే చేస్తాననే నమ్మకంతో ఉన్నా. జాతీయ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడం నా లక్ష్యం. అందుకు వందశాతం కష్టపడతా. సోషల్ మీడియాలో నేను అంత యాక్టివ్ కాదు. అందుకే ఇక్కడే అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా.. నాపై విశ్వాసముంచిన సెలక్టర్లకు ధన్యవాదాలు' అని వరుణ్ పేర్కొన్నాడు.
తమిళనాడుకు చెందిన వరుణ్ 13వ ఏట నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. 17వ ఏట వరకు వికెట్ కీపర్గా ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఆడాడు. అయితే అక్కడ ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు. నిరాశకు గురైన వరుణ్ ఆటను వదిలి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిగ్రీలో చేరాడు. ఆ తర్వాత ఫ్రీలాన్స్ ఆర్కిటెక్ట్గా పని చేస్తున్నా.. క్రికెట్ను మర్చిపోలేకపోయాడు. దీంతో మళ్లీ క్రికెట్ వైపు అడుగులు వేశాడు. క్రోమ్బెస్ట్ క్రికెట్ క్లబ్లో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా చేరాడు. కానీ మోకాలి గాయం రూపంలో దురదృష్టం మరోసారి వెంటాడింది.
ఆ తర్వాత స్పిన్నర్గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు వరుణ్. టెన్నిస్ బాల్ క్రికెట్లో బ్యాట్స్మెన్ ఊచకోత నుంచి తప్పించుకోవడానికి ఆర్కిటెక్ట్ బుర్రతో తన బౌలింగ్కు పదునుపెట్టాడు. తనను తాను మిస్టీరి స్పిన్నర్గా ఆవిష్కరించుకున్నాడు. కొంతకాలం క్లబ్ క్రికెట్లో రాణించాడు. 2018లో తమిళనాడు ప్రీమియర్ లీగ్తో సత్తా చాటేందుకు అవకాశం వచ్చింది. ఆ లీగ్లో మధురై పాంథర్స్ తరఫున ఆడిన వరుణ్.. ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దాంతో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ నెట్స్లో కూడా బౌలింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సమయంలో కోల్కతా జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్, స్పిన్ కోచ్ కార్ల్ క్రో వద్ద మెళకువలు నేర్చుకున్నాడు.
ఆపై తమిళనాడు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడి సత్తాచాటాడు. రంజీల్లో ఆడాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరఫున ట్రయల్స్లో కూడా పాల్గొన్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస ధర ఉన్న వరుణ్ను.. పంజాబ్ ఏకంగా రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ వరుణ్ సత్తాచాటలేకపోయాడు. దీంతో పంజాబ్ వదిలేసింది. ఈ ఏడాది కోల్కతా రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ఈ ఐపీఎల్లో అద్భుతంగా రాణించి ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
దురదృష్టవశాత్తూ టాస్ గెలిచా.. ఒక్క విజయం కోసం మూడు మ్యాచ్ల నుంచి ఎదురుచూస్తున్నాం: శ్రేయాస్