హైదరాబాద్: విలేకరుల సమావేశంలో కంటతడి పెట్టిన స్టీవ్ స్మిత్.. నన్ను ఈ ఒక్కసారికి మన్నించమంటోన్న డేవిడ్ వార్నర్.. ఇప్పుడు వీళ్లతో పాటుగా బాన్క్రాఫ్ట్ కూడా క్షమాపణ కోరుకుంటున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో 9 నెలల నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ బాన్క్రాఫ్ట్ పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో శాండ్ పేపర్ విషయంలో తాను అబద్ధం చెప్పానని, అలా చెప్పినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన బాన్క్రాఫ్ట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎల్లో టేప్ను ఉపయోగించినట్టు చెప్పాడు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో అతడు ఉపయోగించింది టేప్ కాదని, శాండ్ పేపర్ అని తేలింది. దీనిపై బాన్క్రాఫ్ట్ వివరణ ఇచ్చాడు.
'నేను అబద్ధం చెప్పాను. శాండ్ పేపర్ విషయంలో అబద్ధం ఆడా. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అలా చెప్పా. క్షమించండి. అలా చెప్పినందుకు సిగ్గుపడుతున్నా. 'ఐయామ్ వెరీ సారీ' అని గురువారం పాల్గొన్న సమావేశంలో పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్లో దోషులుగా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్లను తేల్చి చెప్పింది. దీంతో ఈ ముగ్గురిని స్వదేశానికి పంపేసింది. దీంతో వీరందరూ గురువారం ఆస్ట్రేలియా చేరుకున్నారు.
తొమ్మిది నెలల నిషేదానికి గురైన బాన్ క్రాఫ్ట్ తొమ్మిది నెలల తర్వాత జట్టులో ఉండేందుకు కష్టపడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేదించడం కంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదనే భావాన్ని వ్యక్తపరిచాడు.