
హైదరాబాద్: టెస్టుల్లో తన ప్రదర్శన గురించి గతంలో అతిగా ఆలోచించేవాడినని, ఇప్పుడు దానిని వదిలేసి ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చెప్పాడు. తన కెరీర్ గొప్పగా సాగుతుండటానికి కుటుంబమే కారణమని రోహిత్ తెలిపాడు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో "టెస్టుల్లో విజయవంతం కావడం గురించి చాలా తీవ్రంగా ఆలోచించేవాడిని. ఇలాంటి షాట్ ఎందుకు ఆడానా అని తలబద్దలు కొట్టుకునేవాడిని. ప్రతి టెస్టు ఇన్నింగ్స్ తర్వాత వీడియో అనలిస్ట్ దగ్గరకు వెళ్లి కూర్చుని నా ఆటను చూసుకునేవాడిని. దీంతో మరింత గందరగోళానికి గురయ్యేవాన్ని" అని అన్నాడు.
"టెక్నిక్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆటను ఆస్వాదించలేకపోయా. గత ఆస్ట్రేలియా సిరీస్కు ముందు నా ఆలోచన మారిపోయింది. ఫలితం ఎలా ఉన్నా సరే సాంకేతిక అంశాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా" అని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో టెస్టుల్లో తనకు చివరి అవకాశమని తాను భావించలేదని రోహిత్ చెప్పాడు.
"నా ఆలోచనల పరంగా చూస్తే నేను ఇప్పుడు భిన్నమైన రోహిత్ను. నా కుటుంబం.. భార్య, కుమార్తె కారణంగా నేను ఇలా మంచి స్థితిలో ఉన్నా. ఇతరులు మాట్లాడుతున్నదాని గురించి నేను ఆందోళన చెందను. నిజానికి ఎవరైనా నా గురించి మంచి లేదా చెడు మాట్లాడితే స్పందించే వయసు దాటిపోయా'' అని ఓ ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పాడు