హైదరాబాద్: ఢిల్లీ వాతావరణంతో తనకు ఎలాంటి సమస్య లేదని బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరిస్కు టీమిండియాకు నాయకత్వం వహించనున్న రోహిత్ శర్మ అన్నాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అసలు, ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ "నేను ఇప్పుడే ఢిల్లీలో దిగాను. అంచనా వేయడానికి సమయం లేదు. నాకు తెలిసినంతవరకు 3వ తేదీన మ్యాచ్ జరుగుతుంది" అని అన్నాడు.
'మిడిలార్డర్లో అనుభవలేమి, టీమిండియాను ఓడించడానికి ఇదే సరైన అవకాశం'
"మేము ఇక్కడ (శ్రీలంకతో) టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మాకు ఎటువంటి సమస్య లేదు. ఢిల్లీ కాలుష్యంపై ఏం చర్చ జరుగుతుందో మాకు తెలియదు. నాకైతే ఎటువంటి సమస్య లేదు" అని రోహిత్ శర్మ అన్నాడు. వరల్డ్కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.
అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించనున్నాడు. టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. కాగా, బుధవారం ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు గురువారం పొల్యూషన్ మాస్క్లు ధరించి అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు.
అనుష్కకు టీ కప్లు అందివ్వడం నేను చూశా: సెలక్షన్ కమిటీపై ఇంజనీర్ తీవ్రవ్యాఖ్యలు
డిల్లీలో వాయు కాలుష్య స్థాయి మరింత పెరిగి గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. అయితే మ్యాచ్కు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో కాలుష్య స్థాయి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ముఖానికి మాస్క్లు ధరించి.. ప్లేయర్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు.
ఢిల్లీలో కాలుష్యం తగ్గేంత వరకు ఎటువంటి మ్యాచ్లను నిర్వహించరాదని టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మ్యాచ్ను ఎట్టిపరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గంగూలీ వివరణతో ఢిల్లీ టీ20 మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.