
హైదరాబాద్: కొన్ని సార్లు అవుట్ కాకుండానే అంపైర్ అవుట్ ప్రకటించడంతో బ్యాట్స్మెన్లు థర్డ్ అంపైర్కు వెళ్తారు. దీంతో సరైన న్యాయం జరుగుతుందని భావిస్తారు. కానీ, ఇక్కడ దానికి విరుద్దంగా జరిగింది. న్యూజిలాండ్లో జరుగుతున్న అండర్ 19 వరల్డ్కప్లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమవుతుంది.
ఫీల్డింగ్ అడ్డుకుంటున్నాడంటూ సౌతాఫ్రికా టీమ్ ఓపెనర్ జివేషన్ పిళ్లైను అవుట్గా ప్రకటించారు. గ్రూప్-ఎలో వెస్టిండీస్తో న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. జివేషన్ ఆడిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ప్యాడ్స్కు తగిలి వికెట్లకు దగ్గరగా వెళ్లింది. అతడు ఆ బాల్ను బ్యాట్తో ఆపి వెంటనే చేత్తో బాల్ను వికెట్ కీపర్కు విసిరాడు. దీనిపై వెస్టిండీస్ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన స్టీవార్ట్ అప్పీల్ చేశాడు.
థర్డ్ అంపైర్ దృష్టికి ఫీల్డ్ అంపైర్లు తీసుకెళ్లారు. ఎన్నో రీప్లేలు చూసిన తర్వాత మూడో అంపైర్ రాన్మోర్ మార్టినెజ్ ఔట్గా ప్రకటించాడు. ఇలాంటి ఘటనల్లో మూడో అంపైర్ బ్యాట్స్మన్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ను ఉపసంహరించుకుంటేనే బ్యాట్స్మన్ బతికిపోతాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట్స్మన్ బాల్ను తాకేందుకు అర్హత లేదు.
ఈ వీడియో చూసిన తర్వాత నిబంధనల ప్రకారం ఔట్గా ప్రకటించడంలో తప్పు కనిపించకపోవచ్చు. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి సౌతాఫ్రికాపై కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో విండీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ కూడా ఆ టీమ్ తీరును తప్పుబట్టాడు. బ్యాట్స్మన్ కావాలని తానేదో లాభపడటానికి అలా చేయలేదు. బాల్ కూడా స్టంప్స్ను తగిలేలా కనిపించలేదు. ఇలాంటి సందర్భంలో అప్పీల్ చేయడం సరికాదు అని బిషప్ అన్నాడు.
ఈ విషయంపై దక్షిణాఫ్రికా ఆటగాడైన డుప్లెసిస్ కూడా స్పందించాడు. అది చాలా పెద్ద జోక్ అంటూ ట్వీట్ చేశాడు. దానికి బదులుగా మిచెల్ జాన్సన్ "దయచేసి నువ్వు ఆపు. నీకిష్టం ఉన్నా లేకున్నా ఇది ఆటలో నియమం. ఈ విషయంలో ఎవరైనా ఒకటే"
అని కాస్త కటువుగానే స్పందించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.