హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే కోల్కతా వేదికగా జరగనుంది. రెండో వన్డేలో ధోనిని త్వరగా అవుట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని ఆ జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపా తెలిపాడు. రెండో వన్డే నేపథ్యంలో జంపా మంగళవారం మీడియాతో మాట్లాడాడు.
చెన్నై వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో హార్దిక్ పాండ్యాను కట్టడి చేయడంలో తాను విఫలమైనట్లు అంగీకరించాడు. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో పాండ్యాతో కలిసి ధోని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
'రెండో వన్డేలో ధోనినే మా టార్గెట్. ధోని వికెట్ చాలా కీలకమైనది. అతన్ని సాధ్యమైనంత తొందరగా అవుట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ధోనిని తొందరగా పంపాలని తొలి వన్డేలో చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈసారి ధోనిని ముందుగానే పెవిలియన్ కు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం' అని జంపా అన్నాడు.
'టీమిండియా జట్టులో సుదీర్ఘకాలంగా ధోని విశేషమైన సేవలందిస్తున్నాడు. అదే అతనికి బలం. టెయిలెండర్లతో కలసి విలువైన భాగస్వామ్యాలు సాధిస్తున్నాడు. ధోనిని తొందరగా అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పైచేయి సాధిస్తాం. తొలి వన్డేలో పాండ్యాతో కలిసి ధోని కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు' అని జంపా పేర్కొన్నాడు.
'భారత్లో ఆడేటప్పుడు గ్రౌండ్ సైజుని బట్టి లెంథ్ కీలకం. తమ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదించుకోవడాన్ని ఎవరూ ఇష్టపడరు. అలా జరిగింది. లెజెండ్ షేన్ వార్న్ బౌలింగ్లో కూడా జరిగింది. ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండటమే మంచింది' అని జంపా అన్నాడు.
తొలి వన్డేలో ధోని, పాండ్యా భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించని సంగతి తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా 66 బంతుల్లో 83 పరుగులతో రాణించాడు. స్పిన్నర్ జంపా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లతో 24 పరుగులు పిండుకున్న సంగతి తెలిసిందే.
దీనిపై కూడా జంపా స్పందించాడు. 'ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేసినందుకు నేను గర్వపడుతున్నాను. కానీ.. హార్దిక్ పాండ్యా కోసం నేను తయారుచేసుకున్న ప్రణాళికల్ని సరిగా అమలు చేయలేకపోయాను. ఓవర్ మధ్యలోనే హార్దిక్ పాండ్యని నాన్స్టైకర్ ఎండ్ వైపు రప్పించేందుకు ప్రయత్నించా.. అందులో భాగంగానే మూడు బంతుల్ని అతని పాదాలకి దగ్గరగా విసిరాను' అని జంపా అన్నాడు.
'అయితే.. వాటిని అతను స్టాండ్స్లోకి సిక్స్లుగా తరలించేశాడు. హార్దిక్ లాంటి హిట్టర్కి బంతులు వేయడం కష్టమే. అతను నైపుణ్యమున్న క్రికెటర్. మా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇంతటితో ఆగిపోదు' అని జంపా అన్నాడు. పాండ్యాతో కలిసి ధోని వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో టీమిండియా 281 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్ను 21 ఓవర్లకు కుదించి ఆస్ట్రేలియా లక్ష్యం 164 పరుగులుగా నిర్దారించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దీంతో తొలి వన్డేలో ఆసీస్పై డక్ వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరిస్లో గురువారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో రెండో వన్డే జరుగనుంది.