ఢిల్లీ: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఐదు రోజుల క్రితం బంగ్లాదేశ్.. భారత్ చేతిలో గెలుపు దరికి వచ్చి, చివరకు ఓడింది. మూడు బంతుల్లో రెండు పరుగులు కావాల్సిన పరిస్థితిలో బంగ్లా ఆటగాళ్లు... సింగిల్స్కు ప్రయత్నించకుండా భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేశారు.
ఈ దశలో ఇద్దరు ఆటగాళ్లు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. వారు సింగిల్స్ ప్రయత్నం చేసి ఉంటే గెలిచేవారు. కానీ భారీ షాట్లు కొట్టబొయి, క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. దీంతో చివరి సెకనులో భారత్ను విజయలక్ష్మి వరించింది.
దీనిపై బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ తాజాగా క్షమాపణ చెప్పాడు. తాను సింగిల్స్ తీసే బదులు షాట్ కొట్టానని, ఆ కారణంగానే బంగ్లా ఓడిందని, ఇందుకు తన దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని చెప్పాడు. బంగ్లాదేశ్ ప్రజలు తనను క్షమించాలని ఆయన కోరాడు.
తాను ఆ షాట్ ఆడడం వల్లే అవుటయ్యానని, తన తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా భారీ షాట్లకు యత్నించి అవుటయ్యారని, దీంతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనన్నాడు.
అదే పొరపాటు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా, భారత జట్టు కెప్టెన్ ధోనీ గతంలో చేసిన 'బిగ్ షాట్ ఆడి మ్యాచ్ను ముగించాలి. అయితే అలాంటి షాట్ ఆడేముందు చేతిలో వికెట్లు ఉన్నాయా? లేదా? అన్న విషయం సరిచూసుకోవాలి. ఈ షాట్ ద్వారా తాను అవుటైనా తర్వాత వచ్చే ఆటగాడు మ్యాచ్ను ఫినిష్ చేస్తాడని భావించినప్పుడు బిగ్ షాట్ ఆడడంలో తప్పులేదు' అంటూ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.