సెప్టెంబర్ 5న జట్టు ఎంపిక:
సెప్టెంబర్ 24 నుంచి సౌతాఫ్రికాతో ఐదు టీ-20లు, మూడు వన్డేల సిరీస్లు జరగనున్నాయి. దీనికోసం సెప్టెంబర్ 5న సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తొలి మూడు టీ20లకు జట్టును ఎంపిక చేయనున్నారు. యువ క్రీడాకారిణులకు అవకాశాలు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. మిథాలీ 2021 వన్డే ప్రపంచకప్లో ఆడతానని చెప్పినా.. టీ20 ఫార్మాట్లో మాత్రం ఆమెను జట్టులో కొనసాగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటా:
36 ఏళ్ల మిథాలీ మాట్లాడుతూ.. 'వచ్చే నెలలో జరిగే టీ20 సిరీస్కు తప్పకుండా అందుబాటులో ఉంటా. అయితే టీ20 ప్రపంచకప్ గురించి మాత్రం ఇంకా ఏమీ ఆలోచించలేదు. ప్రస్తుతమైతే ఈ సిరీస్పైనే దృష్టి పెట్టా. నేను సాధారణంగా ఒక సిరీస్ పూర్తయిన తర్వాత మరో సిరీస్ గురించి ఆలోచిస్తా' అని మిథాలీ తెలిపింది. అంటే.. మిథాలీ టీ20 ప్రపంచకప్ కూడా ఆడుతా అని చెప్పకనే చెప్పింది. గతేడాది ఇంగ్లండ్తో టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్లో మిథాలీని పక్కనబెట్టడం పెను దుమారాన్నే లేపింది. ఈ పరిణామాలతో టీ20 ఫార్మాట్లో ఆమె భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.
టీ20 కెరీర్పై ఓ నిర్ణయం తీసుకోవాలి:
జట్టు ఎంపికకు ముందు మిథాలీతో సెలెక్టర్లు చర్చించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 'వన్డే జట్టులో మిథాలీకి చోటు ఖాయమే. మిథాలీ గొప్ప క్రికెటర్. కానీ.. టీ20 కెరీర్పై తొందరగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. టీ20 ప్రపంచకప్కు మరో ఆరు నెలల సమయం ఉంది. ఈలోపు కొంతమంది యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలి. మిథాలీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి' అని ఆ అధికారి తెలిపారు.