
బెంగళూరు: తిలక్ వర్మ. హైదరాబాద్కు చెందిన కుర్ర క్రికెటర్. ఈ సీజన్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఎంట్రీ ఇచ్చాడు. తన సత్తా నిరూపించుకున్నాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న ముంబై ఇండియన్స్లో మిడిలార్డర్లో కీలక బ్యాటర్గా ఆవిర్భవించాడు. డెబ్యూ సీజన్లోనే రెండు అర్ధసెంచరీలు సాధించాడు. మొత్తంగా 14 మ్యాచ్లల్లో 131.02 స్ట్రైక్ రేట్తో 397 పరుగులు చేశాడు తిలక్ వర్మ. మూడు సార్లు నాటౌట్గా నిలిచాడు.
అదే ఊపును ఇప్పటికీ కొనసాగిస్తోన్నాడు తిలక్ వర్మ. ఇండియా-ఏలో అడుగు పెట్టిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో కదం తొక్కాడు. న్యూజిలాండ్-ఏ టీమ్తో కొనసాగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో కొద్దిసేపటి కిందటే తిలక్ వర్మ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 121 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సొలియా బౌలింగ్లో వాకర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇండియా-ఏ నాలుగో రోజు తన తొలి ఇన్నింగ్ను డిక్లేర్ చేసింది. తిలక్ వర్మ అవుట్ అయిన కొద్దిసేపటికే 571 పరుగుల వద్ద ఇన్నింగ్ డిక్లేర్ ప్రకటించింది. న్యూజిలాండ్ ఏ తన తొలి ఇన్నింగ్లో సరిగ్గా 400 పరుగులకు ఆలౌట్ అయింది. జో కార్టర్ 197 పరుగులు చేశాడు. దీనికి బదులుగా ఇండియా-ఏ తన తొలి ఇన్నింగ్లో 571 పరుగులు చేసింది. ఇండియా టీమ్లో మొత్తంగా మూడు సెంచరీలు నమోదయ్యాయి. ఓపెనర్ అభిమన్య ఈశ్వరన్ 132, రజత్ పటిదార్ 176, తిలక్ వర్మ-121 పరుగులు చేశారు.
రజత్ పటిదార్కు కూడా ఇది అరంగేట్రం మ్యాచ్. ఐపీఎల్లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. కేప్టెన్ ప్రియాంక్ పంచల్-47 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ విఫలం అయ్యాడు. 21 పరుగులు మాత్రమే చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 36 పరుగులకు పరిమితం అయ్యాడు. ఇన్నింగ్ డిక్లేర్ చేసే సమయానికి వికెట్ కీపర్ శ్రీకర్ భరత్-23, కుల్దీప్ యాదవ్-8 పరుగులతో నాటౌట్గా నిలిచారు.