న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయం.. మరోవైపు కఠిన బయో బబుల్.. క్రికెటర్లను మానసికంగా దెబ్బతీస్తోంది. దాంతోనే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడలేమంటూ ఆటగాళ్లంతా ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఈ సీజన్ ఐపీఎల్కు బ్రేక్ ఇస్తున్నానని ప్రకటించగా.. తాము కూడా వ్యక్తిగత కారణాలతో లీగ్ను వీడుతున్నామని ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ తెలిపారు. బయో బబుల్లో ఉండలేక లివింగ్ స్టోన్ వెనుదిరిగాడు. ఆండ్రూ టై, లివింగ్ స్టోన్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నారు.
అయితే లీగ్ నుంచి తప్పుకోవడానికి ముఖ్య కారణం దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరసని స్పష్టంగా అర్థమవుతోంది. పైగా దేశంలో నెలకొన్ని విపత్కర పరిస్థితులు, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఈ ఆటగాళ్లను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. పైగా భారత్ను ఇతర దేశాలైన ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా రెడ్ లిస్ట్లో పెట్టడం విమానాలపై ఆంక్షలు విధించడం కూడా వీరిని మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపింది. లీగ్ ముగిసిన తర్వాత స్వదేశాలకు ఎలా వెళ్లాలనే ఆందోళన వారిలో నెలకొంది. ఆ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఈ ఆటగాళ్లు రిస్క్ ఎందుకని లీగ్ను వీడారు.
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ డేవిడ్ హస్సీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. 'చాలా దేశాలు ఇండియాకు ఫ్లైట్స్ కుదించడంతో పాటు నిషేధం విధించాయి. పైగా ఆయా దేశాల్లో కఠిన క్వారంటైన్ రూల్స్ తీసుకొచ్చాయి. ఇది ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తోంది. ప్రతీ ఒక్కరు తాము తిరి ఎలా వెళ్లాలనే విషయంపై ఆందోళనకు గురవుతున్నారు.'అని చెప్పుకొచ్చారు. ఇక బయోబబుల్లో ఉన్న ఆటగాళ్లు దేశంలోనే అత్యంత సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. అయితే ఇక్కడి విషయాల కంటే బయట విషయాలపైనే ఆటగాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొంత మంది ఆటగాళ్లు తప్పుకునే అవకాశం ఉంది.
ఇక ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అంటే లీగ్ ముగియడానికి దాదాపు నెల రోజుల సమయం ఉంది. ప్రస్తుతం భారత్లో కరోనా వ్యాప్తి అధికకంగా ఉంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో విదేశీ ఆటగాళ్లతో పాటు స్వదేశీ ప్లేయర్స్ కూడా భయపడుతున్నారు. అటగాళ్లు లీగ్ నుంచి తప్పుకోవడంతో ప్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితులు చూస్తే.. ఐపీఎల్ 2021 సజావుగా సాగేనా? అన్న అనుమానం కలుగుతోంది.