హైదరాబాద్: పాకిస్థాన్ ఎన్నికల్లో ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ విజయం సాధించడంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇమ్రాన్ ఈస్థాయికి రావడానికి 22 ఏళ్లు పట్టిందని.. ఈ అవకాశాన్ని అతడు వినియోగించుకుని దేశ ప్రగతికి పాటుపడతాడని భావిస్తున్నట్లు కపిల్ దేవ్ అన్నాడు. "ఇమ్రాన్ ఖాన్ పట్ల సంతోషంగా ఉంది. కెప్టెన్ పాకిస్థాన్ జట్టుని ఎలాగైతే ముందుండి నడిపించాడో అలానే దేశాన్ని నడిపిస్తాడు" అని కపిల్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
"దేశం ముందు క్రికెట్ ఏపాటిది. వరల్డ్కప్ నెగ్గినప్పుడు ఎంత కసితో ఉన్నాడో.. ఇప్పుడూ అలాగే ఉన్నాడు" అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. క్రికెట్లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన వ్యక్తి ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడిగా మారడం ఎంతో గొప్ప అనుభూతి అని కపిల్ చెప్పాడు.
దాయాది దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు క్రికెట్ దోహదం చేస్తే.. క్రికెటర్లకు అంతకంటే ఆనందమేముంటుందని కపిల్ దేవ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక, ఇమ్రాన్ ఖాన్.. విషయానికి వస్తే నేటి యువతరానికి పెద్దగా పెద్దగా అవగాహన లేకపోవచ్చు. కానీ, 80వ దశకంలో ప్రపంచ క్రికెట్లో గ్రేట్ ఆల్రౌండర్గా కొనసాగాడు.
ఆ సమయంలో పాకిస్థాన్ జట్టుకు నాయకుడు ఒక్కడే అది ఇమ్రాన్ ఖాన్ అనేంతగా అతడి కీర్తి సాగింది. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాక కూడా క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు తిరిగి జట్టు పగ్గాలు చేపట్టాడు. అంతేకాదు పాకిస్థాన్కు అంతా తానై 1992లో వరల్డ్ కప్ విజేతగా నిలిచేలా చేశాడు. ఆ తర్వాత ఆ జట్టు మరో కప్ను సాధించలేకపోయింది.