
హైదరాబాద్; గంగూలీ ఇప్పటి వరకు చెప్పని విషయాలని తను రాస్తున్న ఆత్మకథలో ఒకొక్కటిగా బయటపెడుతున్నాడు. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన దాదా తాను భారత జట్టు కోసం ఓ తప్పు చేశానంటున్నాడు.
ఒకానొక దశలో టీమిండియా మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉంది. అలాంటి సమయంలో కెప్టెన్గా వచ్చి జట్టును ప్రపంచ నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాడు గంగూలీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ధోనీ తర్వాత కోహ్లి వరుస విజయాలు సాధిస్తూ సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారంటే అది అప్పట్లో దాదా వేసిన పునాదే.
అలాంటి గంగూలీ కూడా ఓ వ్యక్తి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా చాలా కష్టాలు అనుభవించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్. ఏరికోరి, ఎందరు వద్దంటున్నా వినకుండా అతన్ని తీసుకొచ్చి కోచ్ను చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని గంగూలీ ఇప్పుడు చెబుతున్నాడు. తన ఆటోబయోగ్రఫీ ఎ సెంచురీ ఈజ్ నాట్ ఇనఫ్ బుక్లో కొన్ని ఆసక్తికర విషయాలు అతడు వెల్లడించాడు. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు చాపెల్ను తీసుకురావడమే అని అతను స్పష్టంచేశాడు.
తన ఆత్మకథలో గంగూలీ ఇలా:
'2004లో జాన్ రైట్ తర్వాత ఎవరు అన్న ప్రశ్న తలెత్తినపుడు నాకు తట్టిన తొలి పేరు గ్రెగ్ చాపెల్. అతడే మనల్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తాడని భావించా. ఇదే విషయాన్ని అప్పటి అధ్యక్షుడు దాల్మియాకు చెప్పాను. అయితే గవాస్కర్లాంటి వాళ్లు వద్దని వారించారు. అతనితో నీకు ఇబ్బందులు తప్పవనీ హెచ్చరించారు. చివరికి గ్రెగ్ సోదరుడు ఇయాన్ చాపెల్ కూడా వద్దని చెప్పినా నేను వినలేదు. అప్పుడు నాకు అనిపించిందే చేశాను' అని పేర్కొన్నాడు.
'కానీ, అతని వల్ల నా కెరీర్ పూర్తిగా దెబ్బతింది. ఆస్ట్రేలియాను జయించా.. కానీ ఆ దేశ పౌరుడిని మాత్రం ఏమీ చేయలేకపోయాను. 2005 నా జీవితంలోనే అత్యంత దుర్బరమైనది. ఎలాంటి కారణం లేకుండా నా కెప్టెన్సీ కోల్పోయాను. ప్లేయర్గానూ చోటు సంపాదించలేకపోయాను. నాకు జరిగిన అన్యాయం ఊహించలేనిది.. ఎప్పటికీ క్షమించలేనిది' అని గంగూలీ ఆ బుక్లో పొందుపరిచాడు.