అందరి చూపూ అతని వైపే..
అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్కు మద్దతుగా నిలిచాడా యువకుడు. అతను చెక్కిళ్లపై మువ్వన్నెల పతాకం పెయింట్ చూస్తేనే ఆ విషయం తెలిసిపోతోంది. కానీ అతను మాత్రం భారతీయుడు కాకపోవడం గమనార్హం. చైనాకు చెందిన సదరు యువకుడు అడిలైడ్ యూనివర్సిటీలో లాంగ్వేజెస్ చదువుతున్నాడట. పేరు చెప్పమంటే చెప్పలేదు కానీ.. తనకు భారత దేశం అన్నా, అక్కడి సంస్కృతి అన్నా చచ్చేంత ఇష్టమని మాత్రం చెప్పాడా యువకుడు. అంతేకాదు, తనకు క్రికెట్లో కోహ్లీ అంటే తెగ అభిమానమని అన్నాడు. హిందీలో చక్కగా మాట్లాడిన ఈ చైనీయుడు.. 'మై ఇండియన్ టీమ్ కీ భక్త్ హూ. ముఝే భారతీయ సంస్కృతి బహుత్ పసంద్ హై' (నేను భారత జట్టు భక్తుడిని. నాకు భారత సంస్కృతి అంటే చాలా ఇష్టం) అని చెప్పాడు.
భారత్ మాతా కీ జై..
ఈ క్రమంలోనే తనకు విరాట్ కోహ్లీ అంటే అభిమానమని, తన ఆట బాగా నచ్చుతుందని చెప్పాడీ చైనీస్ ఫ్యాన్. అతని ఉత్సాహం చూసిన నెటిజన్లు బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావ్? అని అడిగారు. ఆ ప్రశ్న విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా 'భారత్.. భారత్' అంటూ ఉత్సాహంగా సమాధానం చెప్పాడా చైనీస్ కుర్రాడు. తనకు భారత్ అంటే చాలా ఇష్టమని, అందుకే హిందీ నేర్చుకున్నానని వివరించాడు. చివరగా 'భారత్ మాతా కీ జై' అని నినదించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఫ్యాన్ కోరిక తీర్చిన కోహ్లీ
ఈ చైనా కుర్రాడి ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనితోపాటు కేఎల్ రాహుల్ (50) కూడా రాణించడంతో తొలుతు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 184 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ను ధాటిగా ఆరంభించిన బంగ్లాదేశ్.. వేగంగా లక్ష్యం దిశగా సాగింది. అయితే వర్షం అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. భారత బౌలర్లు పుంజుకొని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.