హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రతి సారీ తమ ఆటగాళ్ల తప్పును కప్పిపుస్తూ వెనకెసుకొచ్చె ఆసీస్ మీడియా ఈసారి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ను లక్ష్యంగా చేసుకుని దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి, 'స్మిత్స్ షేమ్' అంటూ గత రెండు రోజులుగా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. తాజాగా ఆస్ట్రేలియా రేడియో స్టేషన్ ట్రిపుల్ జే ఆ దేశ క్రికెటర్లపై ఓ వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో తాజా ట్యాంపరింగ్తో పాటు 1981 వరల్డ్కప్లో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రేగ్ చాపెల్ అతని సోదరుడు ట్రివర్ చాపెల్తో అండర్ఆర్మ్ బౌలింగ్ వేయించి తన జట్టు గెలిచేలా చేశాడు. ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ జే రేడియో స్టేషన్ ఈ వీడియో రూపొందించింది. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
'అండర్ ఆర్మ్ బౌలింగ్ వేయించడం, ఆ తర్వాత కేప్టౌన్లో టేపుతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం.. ఆ తర్వాత క్రికెట్లో మోసాలు చేస్తారా అంటే ఔను అని.. మరి దొరికిపోయారా అంటే అయ్యో ఔనా' అంటూ సరదాగా సాగే సంభాషణలతో ఈ వీడియోను రూపొందించారు.
ఈ వీడియోలో విశేషం ఏంటంటే ఓ మెషిన్ ద్వారా బంతి ఆకారాన్ని మార్చిన ఆటగాడు తర్వాత ఆ మెషిన్ ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ప్యాంటు జేబులో పెట్టుకునే తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Full credit to Australians back in Australia. pic.twitter.com/DIhUXxuQrs
— Ben Karpinski (@followthebounce) March 26, 2018
మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ బాన్క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్కు యత్నిస్తూ అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇది జట్టు వ్యూహంలో భాగమేనని కెప్టెన్ స్మిత్ ప్రకటించడంపై ప్రపంచ క్రికెట్ను నివ్వెర పరిచింది. దీంతో ఐసీసీ స్మిత్పై ఓ మ్యాచ్ నిషేదం, మ్యాచ్ ఫీజు కోత విధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. బాల్ టాంపరింగ్ వివాదంపై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ నిమిత్తం నియమితులైన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్ కేప్టౌన్ చేరుకుని బాల్ టాంపరింగ్ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్లోనే స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లను విచారిస్తున్నారు.
విచారణలో భాగంగా ఆసీస్ హెడ్ కోచ్ డారెన్ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విచారణ ప్రక్రియను బుధవారానికి పూర్తి చేయనున్నారు. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సిఫారసు చేయనున్నారు.
పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఈ ముగ్గురి ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేదం విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.