టోర్నీలో నాలుగో మ్యాచ్:
శనివారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏకంగా 215 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసిన విషయం తెలిసిందే. దీంతో ఛేదనవైపే అన్ని జట్లు మొగ్గు చూపుతుండగా.. సోమవారం రాత్రి 7 గంటలకి భారత్, శ్రీలంక మధ్య టోర్నీలో నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించే అవకాశం ఉంది.
వాతావరణం అనుకూలించకే:
రాత్రివేళ మంచు కురుస్తుండటంతో.. బౌలర్లకి ఏమాత్రం బంతిపై పట్టుదొరకడం లేదు. బౌలర్లు ఎక్కువగా హైట్ నోబాల్స్ వేస్తుండటమే దీనికి నిదర్శనం. ఇదే.. ఛేదన సమయంలో బ్యాట్స్మెన్కి వరంగా మారుతోంది. మైదానం కూడా చిన్నదిగా ఉండటంతో.. యథేచ్ఛగా సిక్సర్లు బాదేస్తున్నారు.
పిచ్పై అలవోకగా బ్యాట్ ఝళిపించి:
శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో శ్రీలంక బ్యాట్స్మెన్ 10 సిక్సర్లు కొట్టగా.. బంగ్లాదేశ్ 12 సిక్సర్లు బాదేసింది. టోర్నీలోని అన్ని మ్యాచ్లు ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుండటం కూడా బ్యాట్స్మెన్కి ఇక్కడ కలిసొస్తోంది. అలవాటైన పిచ్పై అలవోకగా బ్యాట్ ఝళిపించేస్తున్నారు.
శ్రీలంక అలవోకగా:
తొలి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 174 పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు 18.3 ఓవర్లోనే అలవోకగా ఛేదించేసింది.
టీమిండియా 18.4 ఓవర్లలోనే:
భారత్తో జరిగిన రెండో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 139 పరుగులు చేయగా.. టీమిండియా 18.4 ఓవర్లలోనే ఛేదించేసింది.
బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో ఛేదించేసి:
మూడో మ్యాచ్లో శ్రీలంక జట్టు 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. పసికూన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో ఛేదించేసి ఔరా అనిపించింది. దీంతో.. ఛేదనకు దిగిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.