హైదరాబాద్: మ్యాచ్ విజయంతో సంబంధం లేకుండా బాదుడే పనిగా పరుగులు చేస్తోన్న రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు చేరింది. సన్రైజర్స్ హైదరాబాద్పై జరిగిన మ్యాచ్లో అజేయ సెంచరీతో అదరగొట్టిన పంత్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే సీజన్లో ఢిల్లీ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఈ స్టార్ బ్యాట్స్మన్ రికార్డ్ సృష్టించాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ (2008లో 534పరుగులు) పేరిట ఉండగా, ఈ ఏడాది పంత్ ఆ రికార్డు బద్దలుకొట్టాడు. ఈ సీజన్లో 578 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పంత్ కొనసాగుతున్నాడు. గతంలో ఢిల్లీ తరపున ఈ ఘనత సాధించిన వారి జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(2012లో 495 పరుగులు), ఏబీ డివిలియర్స్(2009లో 465పరుగులు), డికాక్ (2016లో 445 పరుగులు)లు ఉన్నారు.
ఐపీఎల్ 2018 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఢిల్లీ డేర్డెవిల్స్తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ (72), కెప్టెన్ విరాట్ కోహ్లి (70) చెలరేగడంతో బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. యువ హిట్టర్లు రిషబ్ పంత్ (61), అభిషేక్ శర్మ (46) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.