న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బద్దలుకొట్టాడు. వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో పాక్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 53 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ సిరీస్లో బాబర్ ఆజామ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వరుసగా 103, 77, 1 పరుగులతో రాణించాడు. దాంతో వన్డేల్లో కెప్టెన్గా అత్యధిక యావరేజ్ కలిగిన ప్లేయర్గా గుర్తింపుపొందాడు.
కెప్టెన్గా 1082 రన్స్ చేసిన బాబర్ యావరేజ్ 90.16గా ఉంది. ఈ క్రమంలోనే 1000కి పైగా పరుగులు చేసిన జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. విరాట్ కోహ్లీ 72.65తో 5449 రన్స్ చేశాడు. ఏబీ డివిలియర్స్ 63.94 సగటుతో 4796 పరుగులు చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్ 57.62 సగటుతో 1671 పరుగులు చేసాడు.
మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(1) విఫలమవ్వగా.. ఇమామ్ ఉల్ హక్(62), షాదాబ్ ఖాన్(86) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. 37.2 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. షాదాబ్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా.. మహమ్మద్ నవాజ్, హసన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు.