
హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి మైక్ హెస్సన్ తప్పుకున్నారు. సుమారు ఆరేళ్లుగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా సేవలందిస్తోన్న ఆయన గురువారం ఉన్నపళంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మైక్ హెస్సన్ పదవీ కాలం ఇంకా ఏడాదిపాటు ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేయడం విశేషం. గురువారం తన పదవికి రాజీనామా చేసినప్పటికీ, జూలై నెల చివరి వరకూ జట్టుతో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు హెస్సన్ తెలిపాడు.
43 ఏళ్ల హెస్సన్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును సైతం కలవరపాటుకి గురి చేసింది. వచ్చే ఏడాది వరల్డ్కప్ జరగనున్న తరుణంలో హెస్సన్ కోచ్ పదవి నుంచి వైదొలగడం కివీస్కు పెద్ద ఎదురుదెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఇటీవల క్రికెట్ బోర్డులో పెద్దలతో చోటు చేసుకున్న విభేదాల కారణంగా హెస్సన్ తన కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ జట్టు హెడ్ కోచ్గా హెస్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ జట్టు అనేక విజయాలను సొంతం చేసుకుంది.
ముఖ్యంగా 2013లో దక్షిణాఫ్రికాపై వన్డే సిరిస్ గెలవడం ఆ జట్టుకు మరచిపోలేని అనుభూతి. హస్సన్ కోచింగ్లోనే న్యూజిలాండ్ జట్టు 2015 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లింది. ఇతడి హయాంలో న్యూజిలాండ్ 21 టెస్టు విజయాలు, 65 వన్డే విజయాలను సొంతం చేసుకుంది. ఇక, టీ20ల్లో 30 విజయాలను సొంతం చేసుకుంది.