లండన్: భారత జట్టు క్రికెట్ మ్యాచ్లు ఆడే సమయంలో అభిమానులు కామెంటేటర్ల రూపంలో ఎక్కువగా వినే గొంతులు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, హర్షా భోగ్లే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్. అయితే, ఈ పేర్లు ఏమీ భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో అభిమానులకు వినిపించడం లేదు.
రవిశాస్త్రి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో కామెంటేటర్గా విధులు నిర్వహించడం కుదరదు. ఇక, ఈ మధ్య కాలంలో సంజయ్ మంజ్రేకర్, హర్షా భోగ్లే, సౌరవ్ గంగూలీ పేర్లు కామెంటేటర్లుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, వీరెవరూ ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కామెంటేటర్లుగా కనిపించడం లేదు.
కానీ, టీవీ కామెంటేటర్ల జాబితాలో భారత్ తరఫున హర్భజన్ సింగ్కు మాత్రమే ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ టీవీ కామెంటేటర్గా భారత్ తరఫున నుంచి హర్భజన్ సింగ్కు మాత్రమే చోటు కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హర్భజన్ సింగ్ ఇటీవలే కామెంటటేర్గా అవతారమెత్తిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్పై వ్యాఖ్యానానికి గాను స్కై స్పోర్ట్స్ చానల్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుస్సేన్, మైకేల్ ఆర్థర్టన్, విండీస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ల సేవలు వినియోగించుకుంటోంది. కాగా, కామెంటేటరీలో హేమాహేమీలైన సౌరవ్ గంగూలీ, హర్షా భోగ్లేవంటి వారి సేవలను విస్మరించింది.
అంతేకాదు ఆసియా ప్రసార హక్కులు పొందిన సోనీ నెట్వర్క్ హర్షా భోగ్లే, మంజ్రేకర్, గంగూలీ సేవలను ఎక్స్పర్ట్ కామెంటరీలకే పరిమితం చేసింది. అయితే ఇందుకు కారణం ఉంది. లండన్లో ప్రత్యేకంగా సెట్టింగ్ వేసి ప్రసారాలను చేయడం ఖర్చుతో కూడుకున్నందున సోనీ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.