ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతున్నాయి. ఇప్పటివరకు ముగిసిన నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్లు గెలిచి, ఒక డ్రాతో నిలిచింది. అదే సమయంలో టీమిండియా విండిస్ పర్యటనలో భాగంగా ఆడిన రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం
ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఒక్కో విజయానికి 60 పాయింట్లు కేటాయిస్తారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఒక్కో విజయానికి 24 పాయింట్లు కేటాయిస్తారు. రెండు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా రెండు మ్యాచ్లు గెలవడంతో (60+60) పాయింట్లతో 120 పాయింట్లు సాధించింది.
అగ్రస్థానం టీమిండియాదే
అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే, రెండు విజయాలు, ఓ డ్రాతో(24+24+8) 56 పాయింట్లు సాధించింది. దీంతో ఈ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుతం ఇండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లోనూ, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఒక టెస్టులో విజయం, మరొక టెస్టును డ్రా చేసుకోవడంతో 32(24+8) పాయింట్ల సొంతం చేసుకుంది.
ఆగస్టు 1న ప్రారంభమైన
ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 1న ప్రారంభమైన యాషెస్ సిరిస్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో తొమ్మిది దేశాలు(ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండిస్)లు ఆడుతున్నాయి.
మొత్తం 71 మ్యాచ్లు
రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా 27 టెస్టు సిరిస్లలో భాగంగా మొత్తం 71 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఛాంపియన్షిప్లో భాగంగా ఈ తొమ్మిది దేశాలు సొంతగడ్డపై మూడు, విదేశాల్లో మూడు సిరిస్లు ఆడనున్నాయి. టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ జూన్ 2021న జరగనుంది. ఈ మ్యాచ్కి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.