ఎంతో గౌరవం:
2021 టీ20 ప్రపంచకప్ దాకా కోచ్గా నియమితులయ్యాక రవిశాస్త్రి బీసీసీఐ టీవీతో మాట్లాడారు. 'నాపై విశ్వాసం ఉంచి తిరిగి కోచ్గా ఎంపిక చేసిన సీఏసీకి ధన్యవాదాలు. భారత జట్టులో భాగమవ్వడం నాకు ఎంతో గౌరవం మరియు గర్వకారణం. జట్టుపై విశ్వాసం ఉంది కాబట్టే మళ్లీ తిరిగొచ్చా. గతంలో కొన్ని జట్ల మాదిరిగా ప్రస్తుత జట్టు కూడా ఓ బలమైన వారసత్వం నెలకొల్పుతుందన్న నమ్మకం ఉంది. బాగా ఆడటమే కాదు భవిష్యత్తు తరాలు కొనసాగించేలా వారి వారసత్వం ఉండాలి. అదే నా కోరిక' అని రవిశాస్త్రి తెలిపారు.
నా లక్ష్యం అదే:
'టెస్టు, వన్డే, టీ20 జట్లలోకి చాలామంది యువకులు వస్తున్నారు. వచ్చే రెండేళ్లు జట్టుకు సంధికాలం. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే పటిష్ఠ జట్టును రూపొందించడమే నా పని. ఈ 25-26 నెలల్లో జట్టును అత్యంత సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం. అప్పుడే బలమైన వారసత్వాన్ని నెలకొల్పేందుకు సమయం వస్తుంది. ఇది అత్యంత సవాల్. సవాళ్లను నేనిష్టపడతా. జట్టు కోసం ఎటువంటి ప్రయోగాలకైనా సిద్ధం. నా పదవీకాలం ముగిసేలోపు సత్తా కలిగిన ముగ్గురు, నలుగురు బౌలర్లను గుర్తించాల్సి ఉంది' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
విఫలమైన చోటే ఆగిపోవద్దు:
'ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఫర్ఫెక్ట్ కాదు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. అత్యున్నత ఆటతీరు కోసం పరితపించినప్పుడు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. పగలూ రాత్రీ కష్టపడ్డప్పుడు, ప్రతిదానిపై ప్రత్యేక దృష్టి ఉంచినప్పుడు అత్యున్నత ఆటతీరు సాధ్యమవుతుంది. ఒక రోజు విఫలమైనంత మాత్రాన అక్కడేతోనే ఆగిపోవద్దు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోవాలి. అడ్డంకులను అధిగమించి ముందుకెళ్లడంపై దృష్టి పెట్టాలి. అదే ఈ జట్టు ప్రయత్నం' అని రవిశాస్త్రి అన్నారు.
కూర్పు కోసం:
'రెండు మూడేండ్లుగా టీమిండియా అత్యంత నిలకడగా ఆడుతోంది. ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే అర్థం అవుతుంది. ఆటగాళ్లు ఒక పరిమితి నిర్దేశించుకున్నారు. ఇప్పుడా పరిమితిని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు ఫలితాలు బాగున్నప్పటికీ.. ఏది అత్యుత్తమ కూర్పో గుర్తించలేం. అందుకే యువతను తీర్చిదిద్దేందుకు వీలైనంత సమయం పెట్టాలి. కొత్త వారిపై నమ్మకముంచితే అన్ని విభాగాలు పటిష్ఠంగా ఉండేలా చూసుకోవచ్చు' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
పవన్ షెరావత్ విజృంభణ.. తలైవాస్ను చిత్తు చేసిన బుల్స్
ఫీల్డింగ్ సూపర్:
'భారత జట్టు ఫీల్డింగ్లో గత నాలుగైదేళ్లలో గణనీయమైన మార్పు వచ్చింది. మైదానంలో అందరూ బాగా కదులుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ బృందంగా నిలవడమే లక్ష్యం. జట్టులో చోటు ఆశిస్తున్న ప్రతీ ఒక్కరికి ఇదే నియమం వర్తిస్తుంది. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు అత్యుత్తమ ఫీల్డర్గా ఉండటం అందరి బాధ్యత. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇది అత్యవసరం. ఆటగాళ్లు, కోచ్లు, జట్టు యాజమాన్యం అందరి ప్రయత్నం ఇప్పుడున్న నిలకడను మరో స్థాయికి తీసుకెళ్లడమే' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.