తప్పు జరిగింది.. క్షమించండి: మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్: భారత్ X ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న మ్యాచ్ టికెట్ల విషయంలో నెలకొన్న గందరగోళంపై హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. టికెట్ల అమ్మకాల విషయంలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని, ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపాడు.
ఈ ఊహించని ఘటన నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పాడు. హెచ్సీఏ పాలక మండలి పూర్తి స్థాయిలో లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని వివరణ ఇచ్చాడు. హెచ్సీఏలో తనతో పాటు ఒకరిద్దరు మాత్రమే ఉండటంతో ఈ సమస్య ఏర్పడిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

టికెట్లు లేవ్...
టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అందజేస్తామని చెప్పిన అజారుద్దీన్.. టికెట్లు అన్నీ అయిపోయాయ్యని స్పష్టం చేశాడు. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికగా అమ్మిన టికెట్ల వివరాలను త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించాడు. టికెట్ల విషయం గురించి మీడియా ప్రశ్నించిన ప్రశ్నలకు అజారుద్దీన్ సమాధనం చెప్పకుండా ధాటవేసాడు. అజారుద్దీన్ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్ గౌడ్ కవరింగ్..
మరోవైపు హెచ్సీఏ సమావేశం ముందు వరకు అజార్పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. హెచ్సీఏ నిస్సహాయత పట్ల సానుభూతి చూపుతూ మాట్లాడారు. ఇద్దరే ఉన్నారని, ఏం చేయలేకపోయారని, ముందే సమాచారం ఇస్తే ప్రభుత్వం సహకరించేదని చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై కూడా అభిమానులు మండిపడుతున్నారు. ఇక తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రుల వైద్య బిల్లులను హెచ్సీఏ భరిస్తుందని చెప్పారు.

తొక్కిసలాట..
గత రెండు, మూడు రోజులుగా టికెట్ల అమ్మకాల విషయంపై నోరు మెదపని హెచ్సీఏ తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానం వేదికగా ఆఫ్లైన్లో అమ్మకాలు మొదలుపెట్టింది. అయితే ఊహించని రీతిలో టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అందుబాటులో ఉన్న 5 వేల టికెట్ల కోసం సుమారు 30 వేల మంది తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

20 మందికి గాయాలు..
పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. దాంతో పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో సుమారు 20 మంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో అటు పోలీసులు.. ఇటు అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. హెచ్సీఏ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసులు అరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ టికెట్ల విక్రయాలపై వివరణ ఇవ్వాలని, పూర్తి స్థాయి నివేదికతో వ్యక్తిగతంగా కలవాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ మమహ్మద్ అజారుద్దీన్ను తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications