హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఏర్పాటు చేసి రిటర్నింగ్ కార్యాలయంలో 62 మందిలో 45 మంది తమ నామినేషన్ ఉపసంవరణ పత్రాలను ఎన్నికల అధికారి సంపత్కు అందజేశారు. దీంతో హెచ్సీఏలోని 6 పదవులకు 17 మంది పోటీలో నిలిచారు.
ధోనీ కూడా ఒక్కరోజులో అవకాశాలు సాధించలేదు.. పంత్ ఆట తీరుపై ఓపిక పట్టండి
హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. సుప్రీం కోర్టులో వివేక్కు సంబంధించి 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కేసు పెండింగ్లో ఉంది. ఈ కేసులో ఇంకా తుది తీర్పు వెలుబడకపోవడంతో హెచ్సీఏ ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారి సంపత్ ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవి రేసు నుండి వివేక్ తప్పుకున్నాడు. రేసులో వివేక్ లేకపోవడం టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్కు కలిసిరానుంది. ప్రధాన పోటీదారు వివేక్ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఇప్పుడు అధ్యక్ష రేసులో ప్రకాశ్ చంద్ జైన్, దీలిప్ కుమార్ కూడా వచ్చారు.
రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేయగా.. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోవడంతో నామినేషన్ను హెచ్సీఏ ఆమోదించలేదు. అధ్యక్ష పదవి కోసం దిలీప్ కుమార్, మహ్మద్ అజరుద్దీన్, ప్రకాష్ చంద్ జైన్ పోటీలో ఉన్నా.. ప్రకాశ్ చంద్, అజారుద్దీన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్పీ మాన్ సింగ్ కుమారుడు విక్రమ్ మాన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారని సమాచారం. ఉపాధ్యక్ష పదవి కోసం జోన్ మోనోజ్, సర్థర్ దైజిత్ సింగ్లు.. కార్యదర్శి పదవి కోసం భాస్కర్, విజయ ఆనంద, వెంకటేశ్వరన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అజహర్ మాట్లాడుతూ... 'హైదరాబాద్ క్రికెట్కు పునర్వైభవం తెచ్చేందుకు నావంతు కృషి చేస్తా. హెచ్సీఏ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. అధ్యక్ష పదవికి అందుకే నామినేషన్ వేశా. ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలోనే చాలా టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 7-8 మంది క్రికెటర్స్ దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నా. అందుకోసం చాలా శ్రమించాలి' అని అజహర్ అన్నారు.